హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేండ్లలో పర్యాటకరంగానికి ఎంతో గుర్తింపు వచ్చిందని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్ డబ్ల్యూటీవో) 24వ సర్వసభ్య సమావేశంలో “బెస్ట్ టూరిజం విలేజ్”గా భారతదేశం నుంచి నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గురువారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును స్పెయిన్లోని భారత రాయబార కార్యాలయం దౌత్యాధికారి సుమన్ శేఖర్ స్వీకరించారు. వర్చువల్గా నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూదాన్పోచంపల్లిని అవార్డుకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా ప్రపంచ పర్యాటక సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న బెస్ట్ టూరిజం విలేజ్ విభాగానికి అన్ని రాష్ర్టాల నుంచి ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసి పంపాలని కేంద్ర పర్యాటకశాఖ ఈ ఏడాది జూన్ 16న కోరిందని తెలిపారు. 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు వెళ్లాయని చెప్పారు. వీటిలో భారత్ నుంచి మేఘాలయలోని కాంగ్థాన్, మధ్యప్రదేశ్లోని లాడ్పురాఖాస్ కూడా పోటీలో నిలచినా, చివరకు భూదాన్ పోచంపల్లి గ్రామానికే అవార్డు దక్కిందని పేర్కొన్నారు.