Pochampally Ikkat | హైదరాబాద్ : పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి సంబంధించిన భౌగోళిక గుర్తింపును మరో 10 ఏళ్లకు పునరుద్ధరించారు. ఈ మేరకు జీఐ ఏజెంట్ సుభాజిత్ సాహా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. భారతదేశం భౌగోళిక గుర్తింపు పొందిన మొట్టమొదటి చేనేత ఉత్పత్తి పోచంపల్లి ఇక్కత్ కావడం గర్వకారణం. తొలిసారిగా 2004లో రిజిస్ట్రేషన్ పొందింది.
జీఐ చట్టం ప్రకారం భౌగోళిక గుర్తింపు అమలులో ఉండటానికి ప్రతి 10ఏళ్లకు ఒకసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంది. అందులో భాగంగా తాజాగా మరోసారి ఇక్కత్ జీఐను పునరుద్ధరించారని జీఐ ఏజెంట్ సుభాజిత్ సాహా తెలిపారు. త్వరలోనే పోచంపల్లి ఇక్కత్ లోగో కూడా పునరుద్ధరణకు వస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా భౌగోళిక గుర్తింపు కోసం భారత్ నుంచి 15,000 కంటే ఎక్కువ ఉత్పత్తులకు అవకాశం ఉందని, అయితే ప్రస్తుతం 1158 దరఖాస్తులు మాత్రమే జీఐ రిజిస్ట్రీలో నమోదు అయ్యాయని పేర్కొన్నారు. రాబోయే 3 ఏళ్లలో 5000కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశముందని విశ్వాసం వ్యక్తం చేశారు.