PM Vishwakarma Yojana | తెలంగాణ పథకాలను కాపీ కొట్టడం.. గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకోవడంలో బీజేపీకి మించిన పార్టీ మరొకటి ఉండబోదు. తాజాగా ప్రధాని మోదీ సర్కారు ప్రకటించిన విశ్వకర్మ యోజన పథకమే ఇందుకు నిదర్శనం. వృత్తి నిర్వహణ పెట్టుబడి, ఆధునిక యంత్ర పరికరాల కొనుగోలు కోసం తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులకు 100 శాతం సబ్సిడీతో (తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా), బ్యాంకు లింకేజీలు లేకుండా లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. ఇప్పటికే తొలివిడతలో 35 వేల మందికి పైగా అందజేసింది. ఈ పథకంపై కేంద్ర సర్కారు కన్నేసింది. ఇదే పథకాన్ని కాపీ కొట్టి విశ్వకర్మ యోజనగా మార్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. కాగా బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఆ పథకానికి ఆమోదం తెలిపింది.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కులవృత్తుల కోసం అమలుచేస్తున్న రూ. లక్ష సాయం పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. ఈ పథకాన్ని విశ్వకర్మ యోజన పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మొత్తంగా రూ.13 వేల కోట్లతో దేశవ్యాప్తంగా 30 లక్షల మంది చేతివృత్తిదారులకు మొదటి దశలో రూ.లక్ష అందిస్తామని ప్రకటించింది. అయితే తెలంగాణ సర్కారు అందిస్తున్న లక్ష రూపాయలను లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కేంద్రం మాత్రం ఐదు శాతం వడ్డీతో కేవలం అప్పుగానే ఇస్తామని ప్రకటించింది. కేంద్ర పథకం కింద లబ్ధిపొందాలంటే సదరు వృత్తిదారుడు మళ్లీ నైపుణ్యశిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణ పొందిన అనంతరమే రూ.15 వేలను అధునాతన యంత్ర పరికరాలను కొనుగోలు చేసేందుకు అనుమతిస్తారు. ఆ తరువాత ఐదుశాతం వడ్డీతో లక్ష రూపాయలు ఇస్తారు. నికరంగా చెప్పాలంటే కేంద్రం విశ్వకర్మ యోజన కింద అందజేసేది కేవలం రూ.15వేలు మాత్రమే. అదీగాక తెలంగాణ ప్రభుత్వం దాదాపు 22 కులవృత్తిదారులకు అందిస్తుండగా, బీజేపీ సర్కారు 1వర్గాల వృత్తిదారులకు మాత్రమే అందించాలని నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాపీ కొడుతూనే ఉంది. పథకాల పేర్లను మార్చి అమలు చేస్తున్నది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనే సీఎం కేసీఆర్ మాటలను ఎప్పటికప్పుడు బీజేపీ సర్కారు నిజం చేస్తున్నది. ఇంటింటికీ నల్లా నీటిని అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని బీజేపీ సర్కారు కాపీ కొట్టింది. హర్ ఘర్ కో జల్ పేరిట అమలు చేస్తున్నది. చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ శ్రీకారం చుట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని అమృత్ సరోవర్ పేరిట, రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట అమలు చేస్తుండడం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మరో తెలంగాణ పథకం చేరిపోయింది. బీసీలకు అందిస్తున్న రూ.లక్ష పథకాన్ని, బీజేపీ విశ్వకర్మ యోజన పేరిట అమలుకు శ్రీకారం చుట్టింది.