సంగారెడ్డి ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జపాన్ రాయబారి సుజుకి హిరోషి, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాచికో ఇమోటో, ఐఐటీ పాలకవర్గ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, డైరెక్టర్ బీఎస్ మూర్తి పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని ఆన్లైన్లో ప్రసంగించనున్నారు. నాలెడ్జ్ ర్యాంకింగ్లో దేశంలోనే ఐఐటీహెచ్ మూడో స్థానం, నిర్ఫ్ ర్యాంకింగ్లో 10 లోపు స్థానంలో ఉన్నది. ఐఐటీలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీతోపాటు అనేక కొత్త కోర్సులను అందజేస్తున్నది. ఇక్కడ 4,800 మంది విద్యార్థులు, 300 మందికిపైగా ప్రొఫెసర్లు ఉన్నారు. ఐదు పరిశోధన కేంద్రాలు ఉన్నాయి.