కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో పర్యటించారు. ఓ రేషన్ దుకాణానికెళ్లి ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని అడిగారు. ఈ విషయమై కలెక్టర్ను కూడా హెచ్చరించారు. కాగా, నిర్మలా సీతారామన్ రేషన్ షాపులో మోదీ ఫొటో గురించి చేసిన రచ్చ సోషల్మీడియాలో ట్రోల్కు గురైంది. ఆమె మాటలపై టీఆర్ఎస్ నేతలే కాక సోషల్ మీడియాలో కూడా నెటిజనులు వ్యంగ్యంగా స్పందించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్ కూడా ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా, మోదీ ఫొటోలు సడెన్గా ఓ చోట ప్రత్యక్షమయ్యాయి. నిర్మలమ్మ ఆదేశించినట్టు రేషన్ షాపులముందైతే కాదండోయ్.. అందుకే ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.
ఓ ట్రాలీ ఆటో రోడ్డుపై వెళ్తోంది. దాని వెనుక నిండా సిలిండర్లున్నాయి. ఒక్కో సిలిండర్పై మోదీ ఫొటో పెట్టారు. కింద గ్యాస్ సిలిండర్ ధర రూ. 1105 అని రాశారు. బీజేపీ సర్కారు గద్దెనెక్కకముందు సిలిండర్ ధర రూ. 400 ఉండగా, ఇప్పుడు ఏకంగా 700 పెరిగింది. దీంతో కొందరు సిలిండర్లకు మోదీ ఫొటోలు పెట్టి నిరసన వ్యక్తంచేశారు. ఈ వీడియో, ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లుకొడుతున్నాయి. ఈ వీడియో ఏ నగరంలో చిత్రీకరించారో మాత్రం తెలియ రాలేదు కానీ.. ఈ వీడియోను షేర్ చేస్తున్న నెటి’జనులు’ మాత్రం ‘మీరు కోరుకున్న మోదీ ఫొటో.. ఇక్కడ బాగుందా నిర్మలాజీ?’ అని ట్రోల్ చేస్తున్నారు.