ములుగు, ఫిబ్రవరి 19 : తెలంగాణ పండుగలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించలేమని చేతులు ఎత్తివేసే ధోరణి ప్రదర్శిస్తే ఆదివాసీ గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. మేడారానికి జాతీయ హోదా కల్పించలేమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పడాన్ని ఎర్రబెల్లి ఖండించారు. ఏడేండ్లలో ఎన్నో ఆలయాలకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్షా తదితరులు మేడారం జాతరను సందర్శించకపోవడం గిరిజనులపై వారికున్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తున్నదని దుయ్యబట్టారు. జాతీయ హోదా కల్పిస్తామని బీజేపీ నాయకులు ఇచ్చిన హామీని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నోమార్లు నివేదికలిచ్చినా స్పందన లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పలుమార్లు జాతరకు వచ్చారని, భక్తుల సౌకర్యాల మెరుగుకోసం ఇప్పటివరకు రూ.380 కోట్లు వెచ్చించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 2.5 కోట్లు మంజూరు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీలో జరిగే కుంభమేళాకు రూ.325 కోట్లు కేటాయించిన కేంద్రం.. మేడారానికి కూడా ఆ స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో ఏర్పాటు చేసే గిరిజన యూనివర్సిటీకి కేవలం రూ.45 కోట్లను కేటాయించిందని, అదే ఆంధ్రప్రదేశ్లోని గిరిజన యూనివర్సిటీకి రూ.784 కోట్లు ఇచ్చిందన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికైనా కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని, లేకపోతే ఆదివాసీ గిరిజన హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.