హైదరాబాద్, ఫిబ్రవరి 8 : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణపై ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు యావత్ భారత్ పార్లమెంటరీ వ్యవస్థనే అవమానించేలా ఉన్నాయని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మండిపడ్డారు. విభజన బిల్లుపై పార్లమెంటులో ప్రధాని వ్యాఖ్యలను 14 మంది టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం ముక్త కంఠంతో ఖండించారు. ఈ వ్యాఖ్యలతో పార్లమెంటరీ విధానాలు, కార్యక్రమాలను మాత్రమే కాకుండా ఉభయ సభల అధిపతులను కూడా మోదీ కించపరిచారని ధ్వజమెత్తారు. పార్లమెంటు క్లిష్టమైన సమస్యలు, అంతరాయాలను ధైర్యంగా ఎదురొంటుందని. ఏం జరిగినా రూల్ బుక్ ప్రకారమే జరుగుతాయని గుర్తుచేశారు. పార్లమెంటులో బిల్లులను ఆమోదించడానికి అశాస్త్రీయ మార్గం ఏమీ లేదని తెలిపారు. చేతులు చూపించడం, మూజువాణి ఓటు ద్వారా మెజారిటీతో బిల్లులు ఆమోదించబడతాయని, ఈ విషయంలో రూల్స్ బుక్, రాజ్యాంగాన్ని అనుసరిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఫిబ్రవరి 13, 2014న స్వయంగా జరిగిన చర్చలో పాల్గొన్నారనే విషయాన్ని మోడీ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని నియంత ప్రధాని మోదీ అని ధ్వజమెత్తారు. తెలంగాణపై ఆయన ఈర్ష్యా, ద్వేషాలు పార్లమెంటు వేదికగా మరోసారి బయటపడ్డాయని మండిపడ్డారు. ప్రస్తావన, నోటీసు లేకుండా, తొందరపాటుగా, రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతిలో బిల్లులను ఆమోదిస్తున్నది ప్రస్తుత పార్లమెంట్లోనే అని విమర్శించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర్రావు, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేఆర్ సురేశ్రెడ్డి, లింగయ్యయాదవ్, సంతోష్కుమార్, కవిత, బీబీ పాటిల్, రంజిత్రెడ్డి, రాములు, దయాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎన్ వెంకటేశ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ప్రధాని మోదీ క్షమాపణ కోరాలి
పార్లమెంట్ ప్రక్రియను, ప్రొసీడింగ్స్ను, ఆనాటి స్పీకర్, రాజ్యసభ చైర్మన్, సభ్యులను అవమానించే విధంగా ప్రధాని వ్యాఖ్యలున్నాయి. ఆయన వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మోదీ తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరి, వెనక్కి తీసుకోవాలి. పార్లమెంట్ ఆమోదించిన బిల్లును తప్పని ప్రధాని చెప్పడం రాజ్యంగ విరుద్ధం, అప్రజాస్వామికం. ప్రస్తుతం పార్లమెంట్లో ఏనాడైనా గొడవలు, గందరగోళం లేకుండా నడిచాయా. అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలతో గందరగోళం నెలకొంటూనే ఉంటుంది. అనేక బిల్లులను సభ ప్రొసీడింగ్స్, ప్రాసెస్ను ఏ మాత్రం పాటించకుండా అప్పటికప్పుడు ప్రవేశపెట్టి, ఏ చర్చ లేకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా హడావుడిగా అనేక బిల్లులను ఆమోదించుకొన్నారు. రెండు మూడు నిమిషాల్లో బిల్లులను ఆమోదించుకొంటున్నారు. ఇలాంటి వాటిల్లో కీలక బిల్లులు కూడా ఉన్నాయి. వాటి కంటే తెలంగాణ బిల్లు మెరుగ్గా ఆమోదం పొందిందనే విషయాన్ని ప్రధాని గుర్తుంచుకోవాలి. ప్రధానివి దిగజారిన మాటలు. – కే కేశవరావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు
మోదీ తెలంగాణకు బద్ద వ్యతిరేకి
బాధ్యతరాహిత్యంగా మాట్లాడిన మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలోకి ఉన్నది కాబట్టి చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చింది. ఒకవేళ మోదీ ప్రధాని అయ్యాక తెలంగాణ ఇచ్చేవారే కాదు. మోదీ వ్యాఖ్యలు 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమాన్ని, లక్షల మంది ఉద్యమకారులను, ఆత్మబలిదానాలు చేసిన వందలాది మంది ఆత్మలను, కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను అవమానించినట్టే. ప్రశాంతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని, విద్వేషం నింపాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నారు. – నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్సీ
తలుపులు మూయాల్సిందే
డివిజన్ జరిగేటప్పుడు డోర్లు మూసివేయడం జరుగుతుంది. డివిజన్ ద్వారా ఆమోదం పొందే ఏ బిల్లుకు అయినా డోర్స్ క్లోజ్ చేస్తారు. డివిజన్ సమయంలో లోపల ఉన్న సభ్యులు బయటికి పోవడానికి వీలుండదు, బయట ఉన్న వారు లోపలికి రావడానికి అవకాశం ఉండదు. ఎందరు సభ్యులు బిల్లుకు అనుకూలంగా వేశారు, ఎంత మంది వ్యతిరేకంగా ఓటు వేశారనేది లెక్కించడానికి డోర్లు మూస్తారు. ఏ బిల్లుకు అయినా ఇదే పద్ధతి ఉంటుంది. ఓటింగ్ అయి పోగానే డోర్స్ ఓపెన్ చేస్తారు.
-గుమ్మడిదల రంగారావు,
మాజీ డైరెక్టర్, లోక్సభ సచివాలయం