హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పట్టాలెక్కింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా వందే భారత్ రైలను ప్రారంభించారు. దీంతో దేశంలో ఎనిమిదో సెమీహైస్పీడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో వందే భారత్ రైలు ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎప్పుడు దీనిని ప్రారంభించారనే విషయాలు తెలుసుకుందాం..
భారతీయ రైల్వే తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును 2019లో ప్రారంభించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏడు వందేభారత్ ఎక్స్ప్రెస్లు సేవలు అందిస్తుండగా తాజాగా ఎనిమిదో వందే భారత్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. మిగిలిని ఏడు రైళ్లు న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్, మైసూర్-చెన్నై, నాగ్పూర్-బిలాస్పూర్, హౌరా-న్యూజల్పాయ్గురి రూట్లలో సేవలు అందిస్తున్నాయి. వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశవ్యాప్తంగా 75 వందే భారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకున్నది.
కాగా, వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 52 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఇతర రైళ్లతో పోలిస్తే ఈ ట్రైన్లలో ప్రయాణించడం ద్వారా ప్రయాణ సమయం 25 శాతం నుంచి 45 శాతం వరకు తగ్గుతుంది. అత్యాధునిక వందే భారత్ రైళ్లలో ఆటోమెటిక్ డోర్స్ ఉంటాయి. జీపీఎస్ ఆధారిత ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. వినోదం కోసం వైఫై హాట్స్పాట్ ఉపయోగించుకోవచ్చు.
వందే భారత్ రైళ్లల్లో సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ క్లాస్ బోగీల్లో రొటేటింగ్ చైర్లు, బయోవ్యాక్యూమ్ టైప్ టాయిలెట్స్, దివ్యాంగులకు అనుకూలంగా వాష్రూమ్స్ ఉంటాయి. అంధుల కోసం సీట్ హ్యాండిల్కు బ్రెయిలీ లిపిలో సీట్ల నంబర్లను ఏర్పాటు చేశారు. ప్రతీ కోచ్కు ప్యాంట్రీ సదుపాయం ఉంటుంది. వేడివేడి కాఫీ, భోజనం, కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి.