హైదరాబాద్: రాష్ట్రానికి వందే భారత్ రైలు రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 19న సికింద్రాబాద్ స్టేషన్లో ప్రధాని మోదీ.. రైలుకు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఆయితే ప్రధాని హైదరాబాద్ పర్యటన వాయిదా పడటంతో ఈ అత్యాధునిక రైలు ప్రారంభంపై సందిగ్ధత ఏర్పడినట్లయింది.
మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం అందించింది. ప్రధాని పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని త్వరలోనే వెళ్లడిస్తామని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ప్రధానమంత్రి మోదీ ఈ నెల 19న హైదరాబాద్కు రావాల్సి ఉంది. వందే భారత్ రైలుతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించాల్సి ఉంది. అదేవిధంగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య రైల్వే ఆధునీకరణ పనులకు శంఖుస్థాపన, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులను శ్రీకారం చుట్టాల్సి ఉంది. అయితే మోదీ పర్యటన అర్ధాంతరంగా రద్దువడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.