నిధులు.. పథకాలన్నీ సొంత రాష్ర్టానికే
స్వరాష్ర్టానికి వెళ్లిన ప్రతిసారీ నిధుల వరద
రెండు పర్యటనల్లో 43 వేల కోట్లు
ఇతర రాష్ర్టాలకు శూన్యహస్తాలు
తెలంగాణకు రూపాయి ఇవ్వని ప్రధాని
త్వరలో రాష్ర్టానికి వస్తున్న మోదీ
ఈసారైనా మాటలేనా.. చేతలేమైనా ఉంటాయా?
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఎనిమిదేండ్లలో దాదాపు పదిహేను సార్లు సొంతరాష్ర్టానికి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ వేల కోట్ల నిధులు తన రాష్ర్టానికి కుమ్మరిస్తూ వచ్చారు. 2015 నుంచి 2020 మధ్యన కేంద్ర ప్రభుత్వం నుంచి గుజరాత్లో వివిధ పథకాల అమలు ఏజెన్సీలకు కేంద్రం నేరుగా ఇచ్చే నిధులు ఏకంగా 350 శాతం పెరిగాయన్న కాగ్ నివేదికే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. ఇవి కాకుండా దేశంలోని ప్రాజెక్టులన్నీ కూడా గుజరాత్కే తరలించిన ఘనత మోదీకే దక్కుతుంది. సొంతరాష్ర్టానికి నిధుల వరద పారించే ప్రధాని, తక్కిన రాష్ర్టాలకు మాత్రం నిధులివ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2019 మార్చి 11న ప్రధాని 2 రోజులపాటు గుజరాత్లో పర్యటించారు. గుజరాత్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటయిన రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయాన్ని ప్రత్యేక చట్టం ద్వారా కేంద్రం స్వాధీనంలోకి తీసుకుపోయారు. 2020 అక్టోబర్ 30, 31 తేదీల్లో పర్యటించిన సందర్భంగా ఆరోగ్య వాన్, ఆరోగ్య కుటీర్, ఏక్తా మాల్ సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఏప్రిల్ 19న పాల ఉత్పత్తి తయారీ సంస్థ బనాస్ డెయిరీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఏప్రిల్ 20న జామ్నగర్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు సంబంధించిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్కు, దాహోద్లో రూ.22,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాజాగా గతవారం రూ. 21,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.16,000 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
తెలంగాణకు రిక్తహస్తాలు..
సొంతరాష్ట్రం గుజరాత్పై ఎప్పటికప్పుడు వరాల జల్లు కురిపిస్తున్న మోదీ, బీజేపీ పాలిత రాష్ర్టాలకు కొద్దో గొప్పో నిధులను విదిలిస్తున్నారు. ఎటొచ్చీ బీజేపీకి వ్యతిరేకంగా గళమిప్పుతున్నందుకు తెలంగాణ వంటి రాష్ర్టాలపైనే కక్ష సాధింపు చర్యలను చేపడుతున్నారని రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. గత డిసెంబర్లో యూపీలో రూ.36,200 కోట్లతో గంగా ఎక్స్ప్రెస్ వే, 594-కిమీ పొడవు, ఆరు లేన్ల ఎక్స్ప్రెస్ వే పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు అక్టోబర్లో యూపీలోనే 9 వైద్య కళాశాలల ప్రారంభించారు. తన నియోజకవర్గం వారణాసికి రూ.5,200 కోట్ల కంటే ఎకువ విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరుచేశారు. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ర్టాలకు వరాలు కురిపిస్తున్నారు. తెలంగాణకు మాత్రం రిక్తహస్తాలే చూపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికీ ప్రధాని మోదీ తెలంగాణకు రెండు సార్లు వచ్చారు. కానీ రాష్ర్టానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడాప్రధాని మోదీ ప్రకటించలేదు. ఇది ప్రధాని వివక్షపూరిత పాలనకు నిదర్శనమని రాజకీయనేతలు ఉదహరిస్తున్నారు. త్వరలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్కు రాబోతున్నారు. రెండు రోజుల పాటు తెలంగాణలోనే బసచేయబోతున్నారు. మైకుల ముందు తెలంగాణ ప్రజలను, ఆత్మగౌరవాన్ని కీర్తించే ప్రధాని.. ప్రగతిబాటన దూసుకెళ్తున్న రాష్ర్టానికి తన బాధ్యతగా ఈ సారైనా ఏదైనా చేస్తారా? రాష్ట్ర బీజేపీ నేతలు మోదీ, షాలతో నోరు విప్పి రాష్ర్టానికి కావలసిన నిధుల గురించి అడుగగలరా?