Chef Yadamma | బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ వంటకాలను ఘుమఘుమలాడిస్తాను.. ప్రధాని మోదీ నుంచి మొదలుకుంటే బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలంగాణ వంటకాల రుచులను చూపించి, మైమరిపిస్తానని బండి సంజయ్ గొప్పలు చెప్పుకున్నారు. కానీ మోదీకి, మిగతా అతిథులకు వంటలు చేయాల్సిన మనిషిని కూడా నోవాటెల్ హోటల్ లోపలికి తీసుకెళ్లలేని పరిస్థితిని కల్పించాడు బండి సంజయ్.
వంట మనిషి యాదమ్మ బృందానికి పాస్లు ఇవ్వకుండా ఘోరంగా అవమానించాడు. పాస్లు ఉంటేనే హోటల్లోకి అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేయడంతో.. యాదమ్మ బృందం రోడ్డుపై బైఠాయించాల్సి వచ్చింది. యాదమ్మ బృందానికి జరిగిన అవమానం మీడియా కంట పడింది. దీంతో పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. అనంతరం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తెలంగాణ ఆతిథ్యం ఏంటో దేశానికి చూపిస్తానని ఢాంబికాలకు పోయిన బండి సంజయ్ ఏర్పాట్లు ఇవేనా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.