PM Modi | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం, ప్రజల ఒత్తిడికి ప్రధాని మోదీ తలొగ్గారు. ఎట్టకేలకు రాష్ట్రంలో గిరిజనవర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదివారం ఆయన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు దేవరకద్ర నియోజకవర్గంలోని అమిస్తాపూర్ గ్రామంలో వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నారాయణపేట జిల్లాలోని జక్లేర్-కృష్ణ రైల్వే లేన్, కాచిగూడ నుంచి కృష్ణా వరకు కొత్త రైళ్లకు జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం భూత్పూర్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసగించారు. తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజనవర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకొన్నట్టు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మోదీ హడావుడిగా ఈ హామీలు ఇచ్చారని స్పష్టమవుతున్నది. ఈ రెండు అంశాలు తప్ప ప్రధాని ప్రసంగం మొత్తం పచ్చి అబద్ధాలు, కుటుంబ పాలన, అవినీతి అంటూ రొడ్డకొట్టుడు వ్యాఖ్యలకే పరిమితమైంది. వాస్తవానికి రాష్ట్రంలో గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచారు.
అది తెలంగాణకు హక్కుగా రావాల్సిందే. అయినా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోకాలడ్డింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. నిజామాబాద్కు పసుపు బోర్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రానికి అనేక లేఖలు కూడా రాసింది. తనను గెలిపిస్తే వారంలోగా పసుపుబోర్డు తెస్తానని 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ బాండ్ రాసి ఇచ్చారు. ఆ తరువాత పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలోపెట్టుకొనే పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీపై మోదీ ప్రకటన చేశారని భావిస్తున్నారు. బాండ్పై రాసిచ్చినదానిని ప్రకటించడానికే ఏండ్లకేండ్లు పడితే.. వాటిని అమలు చేయడానికి ఎంతకాలం పడుతుం దోనని చర్చంచుకుంటున్నారు.
మోదీ అబద్ధాలు- అసలు వాస్తవాలు
‘నా కుటుంబం’లో పాలమూరు లేదా?
ప్రధాని మోదీ తన ప్రసంగంలో తరుచూ ‘నా కుటుంబ సభ్యుల్లారా’ అంటూ మాట్లాడారు. మహబూబ్నగర్లో సభ పెట్టి ఆ జిల్లాకు ఏమీ ప్రకటించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు’కు జాతీయ హోదా కల్పించక పోవడం ఏమిటని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషితో పనులు దాదాపు పూర్తయ్యి వెట్న్ జరిగి నేపథ్యంలో జాతీయ హోదా ప్రకటిస్తే ఏంపోతుందని నిలదీస్తున్నారు. కరువు జిల్లాగా పేరుబడిన పాలమూరు పచ్చబడటం ఇష్టం లేదా? మీ కుటంబ సభ్యుల్లో పాలమూరు బిడ్డలు లేరా? అని అడుగుతున్నారు.
పచ్చి అబద్ధాలు.. రొటీన్ మాటలు
తెలంగాణకు రావడం.. అబద్ధాలు ఆడి వెళ్లిపోవడం ప్రధాని మోదీకి అలవాటే. ఆదివారం కూడా అదే పునరావృతం అయ్యింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై పచ్చి అబద్ధాలు ఆడారు. ప్రాజెక్టులతో పొలాలకు నీళ్లు పారలేదని, రైతులకు ప్రయోజనం కలుగలేదని చెప్పుకొచ్చారు. కాళేళ్వరం ప్రాజెక్ట్ వల్ల రైతులకు కలిగిన ప్రయోజనాలు ప్రధానికి కనిపించకపోవడం విడ్డూరం. ‘ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాకపోతే.. ఒకప్పుడు కరువుకు కేరాఫ్గా ఉన్న తెలంగాణ జిల్లాల్లో ఇప్పుడు పచ్చదనం ఎలా పరుచుకున్నది? సాగు విస్తీర్ణం 1.3 కోట్ల ఎకరాల నుంచి 2.3 కోట్ల ఎకరాలకు ఎలా చేరింది? తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 77 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులకు ఎలా పెరిగింది.’ అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నది వాస్తవం కాదా? అని అడుగుతున్నారు. నడి వేసవిలోనూ నిండుకుండల్లా ఉన్న చెరువులను, గలగలా పారుతున్న కాలువలను, తొమ్మిదేండ్లలోనే ఉబికి వచ్చిన భూగర్భ జలాలను అడిగితే సాగునీటి రంగంలో తెలంగాణ ప్రగతిని వివరిస్తాయని అంటున్నారు.
పసుపుబోర్డుపై కపట హామీ
దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్న నిజామాబాద్లో పపుసు బోర్డు ఏర్పాటు చేయాలనేది రైతుల దశాబ్దాల కల. గత ప్రభుత్వాలు రైతులను ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయి. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పసుపు బోర్డు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనికి ఎంపీ కవిత నేతృత్వం వహించారు. ఆమె ఆధ్వర్యంలో ఎంపీల బృందం అనేకసార్లు ప్రధాని మోదీని, మంత్రులను, అధికారులను కలిసి పసుపుబోర్డు ఇవ్వాలని వినతిపత్రాలు ఇచ్చారు. పసుపు రైతులకు మద్దతుగా ఆరు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో లేఖలు రాయించారు. కానీ ప్రధాని మోదీ మనసు కరగలేదు. చివరికి 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పసుపుబోర్డును చేర్చుతామని చెప్పి బీజేపీ మోసం చేసింది. ధర్మపురి అర్వింద్ అంతకన్నా పెద్ద మోసం చేశారు. తనను గెలిపిస్తే వెంటనే బోర్డు తెస్తానని బాండ్ రాసి ఇచ్చి, గెలిచాక విస్మరించారు. ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో నిజామాబాద్లో ‘స్పైసెస్ బోర్డు’ రీజినల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం, నిజామాబాద్ రైతులు బోర్డు మాత్రమే కావాలని పట్టుబట్టారు. ఈ ఒత్తిడికి కేంద్రం దిగివచ్చింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉత్తర్వులు జారీ చేసి, బోర్డు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని నిజామాబాద్ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
గిరిజన వర్సిటీ.. తెలంగాణపైనే కక్ష
తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం మొదటి నుంచీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఏపీకి ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. ఏపీ పునర్విభజన చట్టం-2014 సెక్షన్ 94 షెడ్యూల్13 (3) ప్రకారం సెంట్రల్వర్సిటీ హోదాతో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాల్సి ఉన్నది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 2019లోనే ములుగు జిల్లా కేంద్రం సమీపంలో 335 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. తాత్కాలికంగా వర్సిటీని కొనసాగించేందుకు ఐటీడీఏ భవనాలను సైతం వినియోగించుకొనేందుకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఈ స్థలాన్ని పరిశీలించి, యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. అయినా కేంద్రం వర్సిటీ ఏర్పాటు అంశాన్ని పక్కనబెట్టింది. ఇదే సమయంలో ఏపీలో ఏమీ లేకున్నా గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసింది.
2019లో కేంద్రం దేశ వ్యాప్తంగా 16 సెంట్రల్ యూనివర్సిటీలకు అనుమతినిచ్చింది. ఇందులో ఏపీ గిరిజన వర్సిటీ కూడా ఉంది. ఆ సమయానికి ఏపీలో భూ కేటాయింపులు, భవనాలు వంటివి ఏమీ లేవు. అయినా వెంటవెంటనే ప్రకటన, వీసీ నియామకం, తాత్కాలిక భవనాల్లో తరగతుల ప్రారంభం చకచకా జరిగిపోయాయి. 12 కోర్సుల్లో సీట్లు భర్తీ చేశారు. తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచి కేసీఆర్ అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. సీఎం కేసీఆర్, మంత్రులు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ప్రధాని, సంబంధిత మంతులకు వినతిపత్రాలు ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా కొట్లాడారు. తెలంగాణకు వర్సిటీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు బీఆర్ఎస్ ఒత్తిడి తేవడం, మరోవైపు ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీని ప్రకటించారు. హక్కుగా ఇవ్వాల్సిన వర్సిటీ ప్రకటనకే దశాబ్ద కాలం పడితే.. దాన్ని అమలు చేసి, విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడానికి మళ్లీ ఎన్ని దశాబ్దాలు పడుతుందోనని ప్రజలు చర్చించుకొంటున్నారు.