రాష్ట్రంలో సగం మందికి అందని సాయం
ప్రచారం బారెడు.. సాయం మూరెడు!
తెలంగాణలో 66 లక్షల మంది రైతులు
పథక సాయం అందేది 35 లక్షల మందికే
ఇచ్చే రూ.6 వేలకు సవాలక్ష నిబంధనలు
కొత్త రైతుల దరఖాస్తుకు లేని అవకాశం
2019 ఫిబ్రవరికి ముందున్నవారే అర్హులు
మళ్లీ 2024 వరకు దరఖాస్తుకు నో చాన్స్
రాష్ట్రం ఇచ్చిన రైతుబంధు 58 వేల కోట్లు
పీఎం కిసాన్ కింద సాయం 7,689 కోట్లే
షరతులపై నోరుమెదపని బీజేపీ నేతలు
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పరిస్థితి ప్రచారం బారెడు.. సాయం మూరెడు అన్నట్టు తయారైందని అంటున్నారు రైతులు. పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకొంటున్న కేంద్రం.. అది ఎంత మందికి? ఏపాటి ఇస్తున్నదో మాత్రం చెప్పటం లేదని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులం ఉంటే, 35 లక్షల మందికే పీఎం కిసాన్ ఇస్తదా? అని నిలదీస్తున్నారు. మిగతా 31 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చే పిసరంత దానికి కేంద్రం సవాలక్ష షరతులు పెట్టిందని ఆరోపిస్తున్నారు. మోదీ పెట్టిన నిబంధనలతో తమలోని ఎంతోమంది రైతులు అనర్హులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త భూములు కొంటే లేదు.. కొత్త రైతులు దరఖాస్తు చేసుకోరాదు.. అంటూ పథకం అమలు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రం ఇచ్చింది 58 వేల కోట్లు.. కేంద్రం ఇచ్చింది 7,689 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలున్నా.. ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తున్నది. కేంద్రం మాత్రం ఎన్ని ఎకరాలున్నా.. రూ.6 వేలు మాత్రమే అందిస్తున్నది. అది కూడా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఇస్తున్నది. ఇప్పటి వరకు 8 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద రూ.50,448 కోట్లు రైతుల ఖాతాల్లో వేయగా, ఈ సీజన్తో కలిపి ఆ మొత్తం రూ. 58 వేల కోట్లకు చేరనున్నది. పీఎం కిసాన్ను కేంద్రం 11 విడతల్లో ఇచ్చింది కేవలం రూ. 7,689 కోట్లే. అంటే.. కేంద్రం ఇచ్చిన దానికంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.50,311 కోట్లు అధికం. మొన్నటి యాసంగి నాటికి రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరికీ రైతుబంధు అందుతున్నది. కేంద్రం మాత్రం 35 లక్షల మందికే పెట్టుబడి సాయం ఇస్తున్నది. ఈ లెక్కన రాష్ట్రంలోని సగం మంది రైతులకు పీఎం కిసాన్ సాయం అందటం లేదు.
పీఎం కిసాన్కు కొత్తవారికి నో చాన్స్
భూ క్రయ విక్రయాల ఆధారంగా కొత్త రైతులకు రైతుబంధులో రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తున్నది. దీంతో ప్రతి సీజన్లో రైతుల సంఖ్య పెరుగుతూనే ఉన్న ది. పీఎం కిసాన్లో మాత్రం ఆ వెసులుబాటు లేదు. 2019 ఫిబ్రవరిలోపు పాస్ పుస్తకాలు ఉన్న రైతులకే సాయం అందుతున్నది. అర్హులైనా కొత్త వారికి అవకాశం లేదు. మళ్లీ 2024 వరకు కొత్త దరఖాస్తులను తీ సుకోదట. ఈ నిబంధనతో అర్హులైన లక్షల మంది రైతు లు పీఎం కిసాన్కు దూరమయ్యారు. అంతేకాదు.. కు టుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. ప్రైవేటు ఉ ద్యోగులైనా సరే ఐటీ రిటర్నులు దాఖలు చేసి ఉండకూడదు. పెన్షన్ రూ.10 వేలు దాటితే అనర్హులే.
నోరు మెదపని బీజేపీ రాష్ట్ర నేతలు
చీటికి మాటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే బీజేపీ రాష్ట్ర నేతలు.. పీఎం కిసాన్ పథకంలో రాష్ట్ర రైతులకు తీరని అన్యాయం జరుగుతుంటే ఒక్కరూ కిక్కురుమనటం లేదు. రాష్ట్రంలో సగం మంది రైతులు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదు. బీజేపీ నేతలకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే వెంటనే కేంద్రంతో మాట్లాడి నిబంధనలు సడలించి రైతుబంధు మాదిరిగా రాష్ట్రంలోని రైతులందరికీ పీఎం కిసాన్ అందేలా చూడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కొత్తవారికి అవకాశం కల్పించాలి
పీఎం కిసాన్ ద్వారా ఇచ్చేదే కొంత. అది కూడా రాష్ట్రంలో సగం మంది రైతులకే ఇస్తున్నారు. కేంద్రం షరతులు, నిబంధనల పేరుతో అర్హులకూ ఈ పథకం అందడంలేదు. కొత్త దరఖాస్తు చేసుకోవడానికి కూడా వీలు లేదు. వెంటనే నిబంధనలు సడలించి కొత్త వారికి దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించాలి. రైతుబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.58 వేల కోట్లు అందిస్తే, కేంద్రం పీఎం కిసాన్ ద్వారా ఇచ్చింది 7,689 కోట్లే.
– నిరంజన్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి