హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎం శ్రీనివాస్ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా కమిషరేట్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. మే 21, 1991న తమిళనాడులోని పెరంబుదూర్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) చేతిలో హత్యకు గురైన భారత దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా ఏటా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ ఉగ్రవాద చర్య అయినా హేయమైందని, ఇతరుల ప్రాణాలను తీసే హక్కు ఎవరికి లేదన్నారు. ఉగ్రవాదం వల్ల అనేక దేశాలు నష్టపోయాయన్నారు.
దీంతో పౌరుల మధ్య అనేక రూపాల్లో శాంతి, మత సామరస్యం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల ఉగ్రవాద చర్యలతో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఉగ్రవాదం ఏ ఒక్క వర్గానికి, వ్యక్తుల సమూహానికి పరిమితం కాదని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులు అనేక విభన్న వర్గాలు, దేశాలకు చెందిన వారన్నారు. ఉగ్రవాద చర్య దేశ ఆర్థికవృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదం త్వరలోనే అంతం కావాలని, ప్రజలు సోదరభావంతో జీవించాలని ఆకాంక్షించారు.