లివర్ మార్పిడి కి రూ.20 లక్షలు
పేద రైతు కుటుంబానికి పెద్ద కష్టం
బాలుడికి ఇప్పటికే రూ. 15 లక్షలు వైద్యానికి ఖర్చు
సిరిసిల్ల రూరల్, మార్చి 31: పేద రైతు కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. రెండున్నర ఏళ్ల బాలుడికి లివర్ మార్పిడి తప్పనిసరి అయింది. పుట్టిన ఏడాది నుంచే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పటివరకు సుమారు రూ. 15 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైద్యులు లివర్ మార్పిడి తప్పనిసరి అని తేల్చి చెప్పారు. లివర్ మార్పిడికి రూ. 20.లక్షలు ఖర్చవుతుందని వెల్లడించారు.
వివరాలలోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్కు చెందిన చింతలపల్లి భాస్కర్ రెడ్డి- ఝాన్సీ దంపతులకు ఇద్దరు కుమారులు.. చరణ్ రెడ్డి (8), సిద్ధార్థ రెడ్డి (2) ఉన్నారు. చిన్న కొడుకు సిద్ధార్థ రెడ్డి పుట్టిన ఏడాది నుంచి లివర్ సమస్యలతో బాధపడుతున్నాడు. కరీంనగర్, హైదరాబాద్తో పాటు పలు దవాఖానాల్లో వైద్యం చేయించిన నయం కాలేదు. ఇప్పటివరకు రూ. 15 లక్షలు ఖర్చు చేశారు. పేద రైతు కుటుంబానికి చెందిన భాస్కర్ రెడ్డి తన బిడ్డను ఆరోగ్యాన్ని బాగు చేసుకునేందుకు కొంత భూమిని అమ్మాడు. అప్పులు చేసి వైద్యం చేయించినప్పటికీ సిద్ధార్థ రెడ్డికి నయం కాకపోవడంతో ఆవేదన చెందుతున్నాడు. లివర్ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. లివర్ మార్పిడికి రూ. 20 లక్షలు అవసరం ఉంటుందని డబ్బులు ఏర్పాటు చేసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. మంత్రి కేటీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మా కొడుకు లివర్ మార్పిడికి సాయం చేసి ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.