మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod)పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయి గూడెంలో పల్లె ప్రగతి(Palle Pragathi) దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)కు గ్రామాలపై పట్టు ఉండడంతో వాటి అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రగతికి పల్లెలు పట్టుగొమ్మలుగా ఉంటాయని భావించి ఆ దిశగా ఊరూరా పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పరిశుభ్రత, స్వచ్ఛతే లక్ష్యంగా దశలవారీగా పల్లెప్రగతిని చేపట్టడంతో పట్టణాల్లో ఉన్న సౌకర్యాలు పల్లెల్లో కనిపిస్తున్నాయని అన్నారు.
ప్రకృతి వనాలతో పల్లెలన్నీ పచ్చందాలతో కనువిందు చేస్తున్నాయని అన్నారు. ట్రాక్టర్లు, ట్రాలీలతో ఇంటింటికీ చెత్త సేకరణ, గ్రామానికో వైకుంఠధామం9Vaikunthadham), డంపింగ్ యార్డు(Dumping Yard) , నర్సరీ(nurseries)ల ఏర్పాటు, నిరంతరం మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలవుతున్నాయని అన్నారు. పల్లె ప్రగతి కింద ఇప్పటి వరకు తెలంగాణలో 13,528 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,745 గ్రామపంచాయతీల్లో 1329.73 కోట్ల ఖర్చుతో వైకుంఠధామాలు నిర్మించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, ఐటీడీఏ పీవో అంకిత్, ట్రైనీ కలెక్టర్ పింకేష్, సర్పంచ్ భారతి, ఎంపీపీ విజయ, జడ్పీటీసీ పుష్పలత, ఎంపీటీసీ సదయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.