హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలోని హట్టి ప్రాంతంలో బంగారు గనుల కింద అతి విలువైన ప్లాటినం, కాపర్-పల్లాడియం మిశ్రమ లోహ నిల్వలు ఉన్నాయని హైదరాబాద్కు చెందిన భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) పరిశోధకులు తేల్చారు. దాదాపు 6 ఏండ్లపాటు అధ్యయనం చేసిన వీరు బంగారు గనుల అడుగున మైనింగ్ చేస్తే ఈ ఖనిజ నిల్వలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తమ అధ్యయనంలో వెల్లడయ్యిందని చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల తరహాలోనే మైనింగ్ ప్రాంతాల్లో అధ్యయనం చేసి బంగారం కంటే విలువైన ఖనిజ నిల్వలను గుర్తించారు.
బంగారం కంటే ప్లాటినం ఖరీదు
ప్రపంచవ్యాప్తంగా బంగారం కంటే ప్లాటినం అత్యంత విలువైనది. ఎన్నో ఉపకరణాల్లో ప్లాటినం, కాపర్-పల్లాడియం మిశ్రమ లోహ ధాతువులను వినియోగిస్తున్నారు. కర్ణాటకలోని హట్టి బంగారు గనుల ప్రాంతాల్లో ఎన్జీఆర్ఐ పరిశోధకులు 6 ఏండ్లపాటు శోధించి ఈ ఖనిజాల నిల్వలు ఉన్నట్టు తేల్చారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త పీవీ సుందర్రాజు, హట్టి గోల్డ్మైన్స్కు చెందిన పరిశోధకులు ప్రభాకర్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరగగా, జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జర్నల్లో ఈ పరిశోధన అంశాన్ని ప్రచురించారు. ఒడిశాలోని బౌలా-నౌసాహి, సితంపుండి ప్రాంతాల్లోనూ ప్లాటినం నిల్వలు బయటపడినట్టు ఇందులో పేర్కొన్నారు.