హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిలుపునిచ్చారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణి వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ప్లాస్టిక్ నిషేధాన్ని సచివాలయ స్థాయిలో స్వచ్ఛందంగా పాటించడం ద్వారా ఆదర్శంగా నిలవాలని కార్యదర్శులకు సూచించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్లో కేవలం 9% మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నదని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీజలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రం లో స్వయం సహాయక బృందాల మహిళలతో కలిసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ మాట్లాడుతూ రాష్ర్టాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిఒకరూ సామాజిక బాధ్యతతో వ్యక్తిగతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో వినియోగించే ప్రత్యామ్నాయ వస్తువులపై ఏర్పాటు చేసిన ప్రదర్శన, పోస్టర్ను శాంతికుమారి, రాజీవ్శర్మ ఆవిష్కరించారు.