హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): మెట్టభూముల్లో సాగు విధానాలను ప్రోత్సహించి.. సన్న, చిన్నకారు రైతులకు లాభం చేకూరేలా ఇక్రిసాట్ సంస్థ పరిశోధనలు చేస్తున్నది. అమెరికాకు చెందిన ఓ వ్యవసాయ పరిశోధన సంస్థతో కలిసి మెట్ట భూముల్లో సాగుకు అనుకూలంగా ప్లాస్మా వాటర్ టెక్నాలజీపై అధ్యయనం చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఇక్రిసాట్ జీన్ బ్యాంక్తో కలిసి కీటకాలు, తెగుళ్లను తట్టుకొని దిగుబడిని పెంచే ఆధునిక విధానమైన ప్లాస్మా వాటర్ టెక్నాలజీని వినియోగించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే పరిశోధకులు వివిధ దశల్లో ఉన్న మొక్కల జీవన కాలానికి అనుగుణంగా ప్లాస్మా అప్లికేషన్లను ప్రయోగాత్మకంగా ఉపయోగించి ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ప్లాస్మా వాటర్ కంపెనీలతో కుదిరిన ఒప్పందం ప్రకారం దేశంలోని మెట్ట భూముల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేయనున్నారు.
ప్లాస్మా వాటర్ టెక్నాలజీ అంటే?
గాలి, నీరు, విద్యుత్తు సాయంతో నీటిని ప్లాస్మైజ్డ్ వాటర్గా మార్చి మొక్కకు అందించడాన్నే ప్లాస్మా వాటర్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. పేటెంట్ కలిగిన ప్లాస్మా చాంబర్ ద్వారా నీటిని పంపు చేస్తారు. ఈ నీటిలో ఎలాంటి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా మనుగడ సాగించలేదు. పూర్తిగా రియాక్టివ్ ఆక్సిజన్తోపాటు నైట్రోజన్ పరమాణువులను కలిగి ఉంటుంది. గింజలు, మొక్కల్లో రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా దీనిపై విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ టెక్నాలజీతో సాగు నిర్వహణ భారంతోపాటు రసాయనిక ఎరువుల వినియోగం కూడా తగ్గి.. సేంద్రియ ఉత్పత్తులను పొందేందుకు అవకాశం ఉన్నదని ఇక్రిసాట్ వర్గాలు వెల్లడించాయి.