హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): షష్టిపూర్తి వేడుకలకు హాజరైన అతిథులకు మొక్కలు పంపిణీ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సన్సిటీలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. లోకమ్మ, యాదగిరి దంపతుల షష్టిపూర్తి వేడుకలో అరుణ ఫొటో స్టూడియో ఎండీ నిమ్మల సతీశ్ అతిథులకు పారిజాత మొక్కలు అందజేశారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు సతీశ్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం కోసం ఎంపీ సంతోష్కుమార్ చేస్తున్న కృషిని అతిథులు అభినందించారు. తమ ఇంటి ఆవరణలో మొక్కలను తప్పకుండా నాటుతామని వెల్లడించారు.