హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఆమెకు సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హకు లేదన్నారు. కేసీఆర్పై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్మృతికి ఆయన ఘాటుగా లేఖ రాశారు.
హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ కొవిడ్ వ్యాక్సిన్ తయారుచేయగా, ఆ సంస్థను సందర్శించేందుకు 2020 నవంబర్ 28న ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చారని, ఎయిర్పోర్టులో ఆయనను ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవగా.. సీఎం రావద్దని, సీఎస్ను పంపాలని ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశించిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు ఎయిర్పోర్టుకు రాకుండా సీఎం కేసీఆర్ను అడ్డుకున్నది ఎవరు?, దీనిపై ఎవరూ నోరు విప్పడం లేదు ఎందుకు? అని వినోద్ లేఖలో నిలదీశారు.
విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను, నాయకులను కించపరచడం, మర్యాద లేకుండా వ్యవహరించడం ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. కొవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నది హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అని, కానీ వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఇచ్చే ధ్రువీకరణ పత్రంలో మాత్రం ప్రధాని మోదీ ఫొటో వాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మోదీని మించిన మాస్టర్ సేల్స్మెన్ మరెవ్వరూ లేరని, సొంత డబ్బా కొట్టుకోవడంలో ఆయనకు మరొకరు సాటిరారని విమర్శించారు. దుష్ట ప్రచారం, విష ప్రచారం మానుకోవాలని, వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాలని కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులకు వినోద్ హితవు పలికారు. రాజ్యాంగాన్ని, సంస్కృతిని, మతసామరస్యాన్ని గౌరవించడం, అమలుచేయడం సీఎం కేసీఆర్కు తెలిసినంతగా దేశంలో ఏ రాజకీయ నాయకుడికీ తెలియదని పేర్కొన్నారు. తెలంగాణది గంగా జమున తెహజీబ్ సంస్కృతి అని గుర్తు చేశారు.
కేసీఆర్ అంటే మోదీకి భయం
కేసీఆర్ అంటే బీజేపీకి, మోదీకి ఎంత భయమో ఇవాళ అర్థమైంది. అవే ఝూటా మాటలు.. ఆక్రోశపు ప్రసంగాలతో బీజేపీ దొంగల ముఠా తెలంగాణ మీద పడి అడ్డగోలుగా అరిచి గందరగోళ పరిచే ప్రయత్నం తప్ప చేసింది ఏం లేదు. సీఎం కేసీఆర్ అడిగిన ఒక ప్రశ్నకు కూడా ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదు. వాటికి సమాధానాలు ఆయన దగ్గర లేవు. తెలంగాణ అంటేనే అణువణువునా విషం నింపుకొన్న కేంద్ర బీజేపీ నాయకుల మోసపు మాటలు ఇక్కడి ప్రజలు నమ్మరు. ఒక బక పలుచని కేసీఆర్ను ఎదురోవడానికి సమావేశాల పేరుతో ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ మీద పడ్డారు.
కేసీఆర్ నాయకత్వంలోనే డబుల్ ఇంజిన్ సర్కార్
ఢిల్లీ పీఠం కదులుతుందనే భయం వారికి మొదలైంది. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన మోదీ, అమిత్ షా తెలంగాణ పాలిట శత్రువులే. యావత్తు దేశం పక్షాన కేసీఆర్ ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్పలేదు..? యువ నాయకుడు కేటీఆర్ కృషితో హైదరాబాద్ నగరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంటే దాన్ని చూసి జీర్ణించు కోలేకపోతున్నారు. మీ వాట్సాప్ యూనివర్సిటీని, మీ అసత్యపు సోషల్ మీడియా ప్రచారాలను కేటీఆర్ సమర్థంగా తిప్పికొడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలో నంబర్వన్గా ఎదిగింది. తెలంగాణ మోడల్ అభివృద్ధి కావాలని, కేసీఆర్ నాయకత్వం కావాలని యావత్తు భారతదేశం కోరుకుంటున్నది. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు, దేశానికి శ్రీరామరక్ష.
– వేముల ప్రశాంత్రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి