హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఒక విద్యార్థికి ఇంటర్లో 90 శాతం మార్కులు వచ్చాయి. డిగ్రీలో తనకు కచ్చితంగా నిజాం కాలేజీలో సీటు వస్తుంది, అక్కడే క్లాసులు వినాలన్న ఆశతో దరఖాస్తు చేసుకున్నాడు. మెరిట్ విద్యార్థులంతా పోటీపడటంతో ఆ కాలేజీలో సీటు రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అదే కాలేజీకి సమీపంలోని మరో కాలేజీలో చేరాడు. ఇప్పుడా విద్యార్థి ఆశ క్లస్టర్ విధానంతో నెరవేరనుంది. తాను ఆశపడ్డ నిజాం కాలేజీలో కొంతకాలంపాటు తరగతులు వినే అవకాశం కలగనుంది. చిన్న కాలేజీల్లో చేరినా పెద్ద కాలేజీలో క్లాసులు వినే అవకాశాన్ని కల్పిస్తున్నదే క్లస్టర్ విధానం. రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న క్లస్టర్ విధానం మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నత విద్యామండలి అధికారులు నిమగ్నమయ్యారు. విద్యామండలి వైస్చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, పలువురు వీసీలతో ఏర్పాటుచేసిన కమిటీ ఇటీవలే సమావేశమై క్లస్టర్ల ఏర్పాటుపై చర్చించింది. దీనిని మొదట పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి, తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్లోని కొన్ని కాలేజీలను కలుపుతూ పైలట్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
ఒక క్లస్టర్లో కనీసం 6 కాలేజీలు ఉంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. రెండు వర్సిటీ అనుబంధ కాలేజీలు, రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, మరో రెండు వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీలను కలుపుతూ క్లస్టర్ను ఏర్పాటుచేసే అవకాశం ఉన్నది. డిగ్రీ కాలేజీలతోపాటు ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సహా పలు వర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలను క్లస్టర్ విధానంలో అనుసంధానం చేయాలని యోచిస్తున్నా రు. ఒక కాలేజీలో పనిచేస్తున్న బోధనా సిబ్బంది కొంతకాలం క్లస్టర్లోని మరో కాలేజీలో బోధించేలా ఏర్పాట్లుచేస్తారు. ల్యాబ్లు, కోర్సుల కురికులం, మెటీరియల్, గ్రంథాలయాలను పరస్పరం వాడుకొంటారు.