వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 16: వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణం కోసం ఇవ్వొద్దని వర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. జీవో 55ను రద్దు చేసేవరకు ఆందోళన ఆపబోమని తేల్చిచెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు సంక్రాంతి పండుగ రోజుల్లో కూడా నిరసన తెలిపారు. సోమ, మంగళవారాల్లో ఉదయం నుంచే వర్సిటీ ప్రధాన గేటు వద్ద వ్యవసాయ కళాశాల యూజీ , పీజీ, పీహెచ్డీ విద్యార్థులు బైఠాయించారు.
భోగి మంటలు వేశారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల, గవర్నర్ తమిళ్సై సౌందర్రాజన్ మనస్సు మార్చాలని కోరారు. సీఎం, గవర్నర్కు ట్విట్టర్లో వ్యవసాయ వర్సిటీ నాడు, నేడు, భవిష్యత్ ప్రణాళికను పంపించారు. స్థానిక పోలీసులు పండుగ పూట నిరసన ఎందుకని విద్యార్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. ‘మా లక్ష్యం నెరవేరే వరకు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తాం’ విద్యార్థులు స్పష్టంచేశారు. సేవ్ ద యూనివర్సిటీ ల్యాండ్స్, సేవ్ ఫార్మర్స్, స్టూడెంట్ ఫవర్ నేషనల్ పవర్.. అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వర్సిటీ కళాశాల విద్యార్థి సంఘాల నాయకులు రాజ్కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్రెడ్డి, వినయ్రెడ్డి, శంకర్నాయక్, రాకేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వర్సిటీ ప్రధాన కార్యాలయం గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.