నల్లగొండ ప్రతినిధి, మార్చి 25(నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్లా మాట్లాడుతున్నారని.. ఆయనకు వ్యవసాయం, రైతుల కష్టాలు తెలియవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరితో తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర కక్షపూరిత వైఖరి సరికాదన్నారు. రాష్ట్రంలో పండిన యాసంగి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గుత్తా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో దొడ్డు ధాన్యమే పండుతుందని, దాని నుంచి వచ్చే బాయిల్డ్ బియ్యాన్ని కేంద్రం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 2013-14కు ముందు రైస్మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, ఎఫ్సీఐ లెవీగా సేకరించేదని, ఆ తర్వాతనే పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎఫ్సీఐకి బియ్యంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే కేంద్రం నేరుగా వడ్లు కొనుగోలు చేసి తమకు ఇష్టమైన రూపంలో బియ్యాన్ని సేకరించవచ్చని సూచించారు. కోతల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో రైతులను ఆందోళనకు గురిచేసే విధానాలకు కేంద్రం స్వస్తి పలుకాలని సూచించారు. పార్లమెంట్ లోపల, బయటా దీనిపై ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. ఇకనైనా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతుల పట్ల సానుకూల వైఖరితో ముందుకు రావాలని కోరారు.