మహబూబ్నగర్ : మనిషి శారీరకంగా, మానసికంగా సామర్థ్యం కలిగి ఉండేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్- 2022 అంతర్జాతీయ సదస్సును మంత్రి శ్రీనివాస్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని విషయాలతో పోలిస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని, దీనివల్ల మనిషికి మానసిక ఎదుగుదలతో పాటు, శారీరక సామర్థ్యం, క్రమశిక్షణ అలవడతాయని అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అంతర్జాతీయ సదస్సును ఇక్కడ నిర్వహించడం పట్ల యూనివర్సిటీ వీసీ లక్ష్మీకాంథ్ రాథోడ్ను, సిబ్బందిని శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
మనిషి శారీరకంగా మంచి సామర్థ్యం కలిగి ఉంటేనే మెంటల్గా కూడా బాగుంటాడని ,తద్వారా చదువుపై దృష్టి సారించడానికి అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు చదువుతో పాటు, ఫిజికల్ ఫిట్నెస్పై కూడా దృష్టి సారించాలన్నారు. పూర్వకాలంలో ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు మన జీవన శైలి శారీరక శ్రమతో కూడుకొని ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత యాంత్రిక జీవనంలో మనిషి శారీరక కార్యక్రమాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. జీవన విధానంలో మార్పు రావడం వలన మనుషులు అనేక రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. తిరిగి పురాతన సాంప్రదాయాలు, జీవన కార్యక్రమాలను పునరుజ్జీవింప చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వెల్లడించారు.
ఫిజికల్ ఎడ్యుకేషన్తో పాటు, మెంటల్ ఎక్సర్సైజులు కూడా విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. ఒకటవ తరగతి నుండి పీజీ వరకు ఆయా వయసులను బట్టి పరిశోధన చేసి అవి అలవర్చుకునేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదే విధంగా పాలమూరు విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధితో పాటు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిట్నెస్పై కూడా దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరిలో ఫిజికల్ ఫిట్నెస్ ఉండేలా విద్యా విధానం ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
యూనివర్సిటీ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్పై రూపొందించే పుస్తకాలు, ఇతర కార్యక్రమాలకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ అంతర్జాతీయ సదస్సుకు ఆన్లైన్ ద్వారా కూడా ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని ఆయన సూచించారు.
అంతకు ముందు పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎల్బీ లక్ష్మీకాంథ్ రాథోడ్ మాట్లాడుతూ.. ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారా మనిషి దేనినైనా సాధించవచ్చు అని అన్నారు. తాను ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారానే ఒక విశ్వవిద్యాలయానికి ఉపకులపతి కాగలిగానని, అదేవిధంగా దేశంలో ఫిజికల్ ఎడ్యుకేషన్కు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు.
ఈ రెండు రోజుల సదస్సుకు మొదటి రోజు మలేషియా యూనివర్సిటీ ప్రొఫెసర్ లింబ్ బూన్ హుయ్, మాజీ స్పోర్ట్స్ డైరెక్టర్ నీరజ్ జైన్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ అడ్వైజర్ పి చిన్నపరెడ్డి, ఏఐయు ఫార్మర్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ గురుదీప్ సింగ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎన్ రమేష్, పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గిరిజా మంగతాయారు, కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె విష్ణువర్ధన్ రెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయం ఓఎస్డీ టూ వీసీ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.