హైదరాబాద్ : సమాజంలో అణగారిన వర్గాలు, మహిళా సాధికారతకు సావిత్రిబాయి ఫూలే విశేష కృషి చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సావిత్రిబాయి పూలే 192వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బహుజన సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందని అన్నారు.
మహాత్మా పూలే పేరున 310 గురుకులాలతో పాటు విదేశీ స్కాలర్షిప్లను సైతం అందిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే స్థలాల్లో 41 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన వర్గాల సంక్షేమానికి వేల కోట్లను ఖర్చు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఫూలే స్ఫూర్తిని ఇక ముందూ కొనసాగిస్తామని అన్నారు.