BJP | నర్సాపూర్, ఏప్రిల్22: బీజేపీకి చెందిన ఓ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా పెండ్లి పత్రికపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఫొటోను ముద్రించి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో సోమవారం వెలుగుచూసింది. కౌడిపల్లి మండలం కొత్తచెర్వు తండా, మహ్మద్నగర్ గేటు తండాకు చెందిన నునావత్ సురేశ్నాయక్ బీజేపీ కార్యకర్త. ఆయన తన తమ్ముడి పెండ్లి పత్రికపై.. ‘మా తమ్ముడి పెండ్లికి మీరు ఇచ్చే బహుమతి.. రఘునందన్రావుకు మీరు వేసే ఓటు’ అంటూ రాయడంతోపాటు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఫొటో ముద్రించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ అధికారి చంద్రయ్య కౌడిపల్లి మండల ఎస్సై రంజిత్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎప్పై రంజిత్కుమార్రెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నికల సమయంలో ఎంపీ అభ్యర్థి ఫొటోతోపాటు ఓటు వేయాలని ముద్రించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఎస్సై వివరించారు.