హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి పలు రకాల ఆప్షన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ఇటీవల యూనివర్సిటీల వీసీలతో సమావేశమై మెరిట్ ఆధారంగా ప్రతిభావంతులకే పోస్టులు దక్కాలన్న కృతనిశ్చయంతో ప్రధానంగా మూడు ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. రాత పరీక్ష ద్వారానే నియామకాలు చేపట్టాలని, పీహెచ్డీ నిబంధనను కచ్చితంగా పాటించాలని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి వయోపరిమితిలో మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు.
-పాత పద్ధతి ప్రకారం ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీయే నోటిఫికేషన్ జారీచేస్తుంది. థర్డ్పార్టీ చేత స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలను హైకోర్టు తీర్పును అనుసరించి చేపడతారు. ఇంటర్వ్యూలను సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తారు.
-యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీకి ఉమ్మడిగా నోటిఫికేషన్ ఇస్తారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కోపోస్టుకు 3–5 మందిని ఇంటర్వ్యూకు పిలిచి ఎంపికచేస్తారు.
-యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం బీహార్ తరహాలో యూనివర్సిటీ రిక్రూట్మెంట్బోర్డు ఏర్పాటుచేస్తారు. ఇక్కడ స్ర్కీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ బోర్డులో వీసీలతోపాటు, ఉన్నత విద్యామండలి అధికారులు, ప్రభుత్వ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.