Mucherla Pharma City | కందుకూరు, జూన్ 22: నష్టపరిహారం చెల్లించకుండా మా భూములపై మీ పెత్తనం ఏంటి?.. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని రైతులు మండిపడ్డారు.
సోమవారం ఫార్మాసిటీ బాధిత రైతులు ప్రత్యేక సమావేశమై.. భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో మండల పరిధిలోని ముచ్చరలో జోనల్ అధికారి జ్యోతితో ఆర్ఐ శ్రీకాంత్ వచ్చి ఇటీవల సేకరించిన భూముల్లో మోటర్లు, స్టాటర్లను తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకొని అధికారులను అడ్డుకున్నారు.
ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని 123వ సర్వే నంబరులోని భూములను తీసుకున్న ప్రభుత్వం.. ఇచ్చిన మాట ను నిలబెట్టుకోవాలని కోరారు. భూములు కోల్పోయిన వారిలో కొంతమందికే చెల్లింపులు చేసి చేతులు దులుపుకొన్నదని వాపోయారు. భూములు కోల్పోయిన ప్రతి రైతుకూ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫెన్సింగ్ వేసిందే కాకుండా విద్యుత్తు కనెన్షన్లు కూడా ఎందుకు తొలగిస్తున్నారని నిలదీశారు. ఈ వ్యవహారంలో పెద్ద కుంభకోణం దాగి ఉన్నదని ఆరోపించారు. రైతులకు మాజీ సర్పంచ్ తేరేటి లక్ష్మణ్ ముదిరాజ్ మద్దతుగా నిలిచారు. దీంతో ఆర్ఐ శ్రీకాంత్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వారు ఒప్పుకోలేదు.