హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నదని, వర్సిటీల్లో నియామకాలకు అదే అడ్డంకిగా మారిందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. గవర్నర్ క్లియరెన్స్ ఇవ్వగానే వర్సిటీల్లో ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. యూనివర్సిటీల్లోని 1,062 అధ్యాపక ఖాళీలు భర్తీచేయాలని పీహెచ్డీ విద్యార్థులు వినోద్కుమార్కు విన్నవించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామక భర్తీ ప్రక్రియలో పారదర్శకత కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. త్వరలోనే దీనికి గవర్నర్ ఆమోదం తెలుపుతారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆమోదం తెలిపిన వెంటనే భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని హామీఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పీహెచ్డీ విద్యార్థులు జీ వినయ్, ఎం సంతోష్కుమార్, ఎస్ సత్యమూర్తి, జే ప్రశాంత్, ఎల్ కామ్రేడ్, సురేశ్ తదితరులు ఉన్నారు.