హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కరోనా ప్రభావంతో వృద్ధాప్యంలో ఆర్థిక ప్రణాళిక కీలకమన్న విషయం చాలా మందికి అర్థమైంది. దీంతో చాలా మంది రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా బతికేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో పదవీ విరమణ తర్వాత ఆర్థిక ప్రణాళికలు ఏమిటి? ఎంతమంది రిటైర్మెంట్ ప్లాన్స్ చేస్తున్నారు? ఉద్యోగ భద్రత, పనిలో ఒత్తిడి, ఆకస్మిక ప్రణాళికలు తదితర అంశాలపై పీజీఐఎమ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ రెడీనెస్ సర్వే నిర్వహించి పలు కీలక అంశాలను వెల్లడించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, పూణెతోపాటు మరో ఆరు నగరాల్లో సర్వే నిర్వహించింది. మొత్తం 3,009 మంది సర్వేలో పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. వృద్ధాప్యంలో ఆర్థిక ప్రణాళిక చాలా కీలకమని సర్వేలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అభద్రత రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో వృద్ధాప్యం కోసం ఆర్థిక ప్రణాళిక అవసరమని తెలిపారు. ఒకప్పుడు పిల్లల చదువులు, భవిష్యత్తు వంటి అంశాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉండేదని, ఇప్పుడు ఆ జాబితాలో రిటైర్మెంట్ ప్లాన్ కూడా చేరిందని వెల్లడించారు.
కరోనా ప్రభావం తర్వాత చాలా మందిలో ఆర్థిక ప్రణాళికపై అవగాహన వచ్చింది. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధార పడకుండా ఉండాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఆర్థిక అవసరాలకు కావాలన్నా, పిల్లలపై ఆధారపడకుండా ఉండాలని అనుకుంటున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాలు తీరేలా ముందుగానే రిటైర్మెంట్ ప్లాన్స్పై ఆసక్తి చూపుతున్నారు. 2020లో 49 శాతం మంది ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్లాన్స్ ఉంటే, 2023లో అది 67 శాతానికి పెరిగింది. అంటే.. వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాల గురించి ఆలోచించే వారి సంఖ్య మూడేండ్లలోనే 18 శాతం పెరిగింది.
33 ఏండ్ల వయసు నుంచే ఎక్కువమంది రిటైర్మెంట్ ప్లాన్స్ ప్రారంభిస్తున్నారు. కొందరు 50 ఏండ్ల వయసులోనూ ప్రణాళిక చేస్తున్నారు. ఉద్యోగ భద్రత గురించి ఆలోచించేవారి సంఖ్య 69 శాతం నుంచి 55 శాతానికి తగ్గింది. ఉద్యోగంలో ఒత్తిడికి గురయ్యేవారి సంఖ్య 68 నుంచి 55 శాతానికి తగ్గింది. ఆకస్మికంగా ఆర్థిక ప్రణాళికలు చేసే వారి సంఖ్య 88 శాతం నుంచి 81 శాతానికి చేరింది. అంటే.. ముందస్తు ఆర్థిక ప్రణాళికలు చేసేవారి సంఖ్య పెరిగిందని సర్వే స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య 73 నుంచి 75 శాతానికి పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు 10 నుంచి 23 శాతానికి పెరిగాయి. ఇలా.. వృద్ధాప్యంలో ఆర్థిక తోడు ఎంతో అవసరమని ఎక్కువమంది భావిస్తున్నారు.