కరోనా సెకండ్వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అగ్ర నటుడు చిరంజీవి వీడియో సందేశం ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఎంతోమంది వైరస్ బాడిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి వల్ల ఆత్మీయుల్ని కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతోంది. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ర్టాల్లో లాక్డౌన్ విధించారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా ఉండండి. ఇంటి నుంచి అస్సలు బయటకు రావొద్దు. అత్యవసరమై బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించండి. వీలైతే డబుల్ మాస్క్ ధరించండి. రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ తర్వాత కరోనా సోకినా ప్రభావం తక్కువగా ఉంటుంది. ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చినా ఆందోళనకు గురికావొద్దు. భయమే మనల్ని ముందుగా చంపేస్తోంది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఐసోలేషన్కి వెళ్లండి. డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. కరోనా నుంచి బయటపడిన తర్వాత నెలరోజుల్లో యాంటీబాడీస్ తయారవుతాయి. ప్లాస్మాదానం చేస్తే ఒక్కొక్కరు ఇద్దరిని కాపాడిన వారవుతారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండండి’ అని ఆయన కోరారు.