హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ముగ్గురు లేదా అంతకంటే ఎకువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనలు గ్రామీణ ప్రాంతాలకు ఒక రకంగా, పట్టణ ప్రాంతాలకు మరో రకంగా ఉండటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని 213వ సెక్షన్ను సవాలు చేస్తూ న్యాయవాది రాపోలు భాసర్ ఈ పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలు వేర్వేరుగా ఉండటం సమానత్వానికి వ్యతిరేకమని పిటిషన్లో పేర్కొన్నారు.
ముగ్గురు లేదా అంతకంటే ఎకువ మంది పిల్లలున్నవారు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ తదితర ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న పంచాయతీరాజ్ చట్ట నిబంధనలు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించడం లేదని.. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్ పదవులకు పోటీ చేసేవారికి పిల్లల సంఖ్యతో సంబంధం లేదని తెలంగాణ మున్సిపాలిటీ చట్టం స్పష్టం చేస్తున్నదని వివరించారు.
ఈ వ్యత్యాసం సహజ న్యాయ సూత్రాలతోపాటు రాజ్యాంగంలోని 13, 14, 19 అధికరణలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని 213వ సెక్షన్ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టనున్నది.