నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఐదుగురు నిందితులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి ఇవ్వాలని పీపీ జగన్మోహన్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. రేణుక రాథోడ్ (ఏ3), ఢాక్యానాయక్ (ఏ4), రాజేశ్వర్ (ఏ5), పీ గోపాల్నాయక్ (ఏ7), శమీమ్ (ఏ10)ను విచారించేందుకు తమకు అప్పగించాలని పీపీ కోరారు. నిందితులకు నోటీసులు జారీచేసిన అనంతరం వాదనలు వినిపించాలని కోర్టు గురువారానికి విచారణను వాయిదా వేసింది. ఈ నెలలోనే ఇద్దరు ప్రధాన నిందితులను ఈడీ అధికారులు జైల్లోనే విచారించారు. నిందితురాలు రేణుక రాథోడ్ను చంచల్గూడ జైలు నుంచి మంగళవారం కోర్టు ముందు హాజరుపర్చారు. జ్యుడీషియల్ కస్టడీని 4వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ (ఏ1), తినేటి రాజేంద్రకుమార్ (ఏ14) తరఫు న్యాయవాదులు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య తీర్పును వాయిదా వేశారు.