మహబూబాబాద్ : ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఆదివారం మహబూబాబాద్ పట్టణ బొడ్రాయి పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎంపీ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్పై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎవరైనా సీఎం కేసీఆర్, తెలంగాణ ఉద్యమ కారులపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని, తెలంగాణలో ఇతర నాయకుల పాలన అవసరం లేదని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్రెడ్డి సంపాదించిన వేలాది కోట్ల రూపాయలతో షర్మిల రాజకీయ పార్టీని స్థాపించి తెలంగాణలో ఊరేగుతున్నారని ఆరోపించారు. వైఎస్ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని మంత్రి గుర్తుచేశారు. ఇప్పటికైనా పరిమితుల మేరకు పాదయాత్ర చేసుకోవాలని షర్మిలకు సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుగులోత్ శ్రీ రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.