నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 25 : గ్యాస్ కష్టాలు ఇంకా తొలగడం లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలుచోట్ల ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కంపెనీలు సిలిండర్లను డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేయకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణాల్లోని ఏజెన్సీల వద్దకు ఉదయమే చేరుకొని పడిగాపులు కాస్తున్నారు. మధ్యాహ్నం ఎండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిలబడ్డారు. నారాయణపేట జిల్లాలో కమర్షియల్ గ్యాస్ లేక హోటళ్లు, టిఫిన్ సెంటర్లతోపాటు ఛాయ్ దుకాణాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. నారాయణపేటలోని జీషాన్ రెస్టారెంట్ నిర్వాహకులు గ్యాస్ కొరత కారణంగా ఐదు రోజులుగా కట్టెల పొయ్యిపై వంటలు సిద్ధం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో వారం రోజులుగా సిలిండర్ల కోసం గోసపడుతున్నారు. బుధవారం లోడ్ వస్తున్నదనే సమాచారంతో వివిధ గ్రామాలకు చెందిన వినియోగదారులు ఉదయమే గ్యాస్ ఏజెన్సీ వద్దకు చేరుకొని బారులు తీరారు. ఖాళీ సిలిండర్లతో క్యూలో ఉంచి నిలబడ్డారు. పనులు మానుకొని వంటగ్యాస్ కోసం గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నామని పేద, మధ్య తరగతి ప్రజలు వాపోయారు. అదనపు కలెక్టర్ అనిల్కుమార్ గ్యాస్ ఏజెన్సీని సందర్శించి వివరాలు సేకరించారు. వంటగ్యాస్ కొరత లేదని వినియోగదారులందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. పది రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడగా వినియోగదారులు ఏజెన్సీల వద్దకు చేరుకొంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపల్లి గ్యాస్ ఏజెన్సీ ఎదుట బుధవారం కూడా భారీ సంఖ్యలో జనం ఖాళీ సిలిండర్లతో బారులుతీరారు. ఈ నెల 19న బుక్ చేసుకొన్న వారికి సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్టు నిర్వాహకులు కార్యాలయం ఎదుట బోర్డు ఏర్పాటు చేశారు. రెండు గంటలు పంపిణీ చేసిన నిర్వాహకులు స్టాక్ అయిపోయిందని చెప్పారు.