ముషీరాబాద్, ఫిబ్రవరి 27: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. కుమ్మెర గ్రామంలో జాతర సందర్భంగా చిన్నారి మృతిని నిరసిస్తూ శుక్రవారం విద్యానగర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాగ అరుణ్కుమార్ మాట్లాడుతూ.. రెడ్డి సామాజికవర్గం బీసీలపై దాడి చేసి చిన్నారిని హత్య చేయడం శోచనీయమని పేర్కొన్నారు. రజక దంపతులపై అగ్రవర్గాలకు చెందినవారు కర్కశంగా దాడి చేసి చిన్నారి మృతికి కారణమయ్యారని ఆరోపించారు. గుడిలోకి రావద్దని అడ్డుకుని దాడికి దిగడంతో కాళ్లపై పడి దండం పెట్టినా విక్షణారహితంగా కొట్టడం దారుణమని, పసిబిడ్డను కాళ్లతో తన్ని చంపడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టం మాదిరిగానే బీసీల రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేశ్, జిల్లపల్లి అంజి, అనంతయ్య, నిమ్మల వీరన్న, తిరుపతియాదవ్, భానుగౌడ్, ప్రభుగౌడ్, బాలస్వామి, అజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు అన్యాయం చేస్తే పోరాటం : ఎమ్మెల్సీ సత్యం
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు న్యాయం జరిగేంతవరకు శాసనమండలిలో పోరాడుతానని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షకు శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు పాలకులు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన హామీలకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చేతివృత్తులు, సంచార జాతుల వారికి బడ్జెట్లో కేటాయించిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. గత బడ్జెట్లో బీసీలకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాగర్కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగిన అమానవీయ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.