Perni Nani | తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలిపై ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. నీ ఆసుపత్రి భాగోతాలు తెలియవా..? ఒక్క హిందువుకైనా బిల్లు తగ్గించావా..? అంటూ మండిపడ్డారు. తిరుమల డిక్లరేషన్పై ఆయన స్పందించారు. బతికితే జగన్లా బతకాలన్నారు. జగన్ తాత తండ్రి క్రైస్తవంలోకి వచ్చాడని.. వాళ్ల గురించి తెలియంది ఎవరికి అని ప్రశ్నించారు. బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబు గురించి పవన్ మెచ్చుకోలుగా చెప్పడం.. బీజేపీ నేతలు డబ్బాలు కొడుతున్నారంటూ విమర్శించారు. హైందవ మతాన్ని, దేవుడిని నమ్మేవాడు బూట్లు వేసుకుని పూజలు చేస్తాడా? మనిషన్న వాడు బూట్లు వేసుకుని పూజలు చేస్తాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకు అనేక వీడియోలు, ఫొటోలు సాక్ష్యాలు ఉన్నాయని.. దేవుడి గురించి మీరా మాట్లాడేది అంటూ తీవ్రంగా స్పందించారు. హిందుత్వంపై మాట్లాడే బాబు తన తల్లిదండ్రులు చనిపోతే ఎందుకు తల వెంట్రుకలు తీయించుకోలేదని ప్రశ్నించారు. తన తల్లిదండ్రులు చనిపోతే తాను తలవెంట్రుకలు తీసుకున్నానని.. ఎవరు ఏం పాటిస్తున్నారు.. మీరు ఏం ఆచరిస్తున్నారు ? మాట్లాడే భాష ఏంటీ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్నపై నమ్మకం లేకుండానే జగన్ మెట్లెక్కి నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకొని వచ్చాడా? అన్నారు.
తెలంగాణ బీజేపీ నుంచి ఒకామె భజన చేసుకుంటు తిరుమల వచ్చిందని విమర్శించారు. ఇది దిక్కుమాలిన తనమని.. ఆమె ఆసుపత్రిలో భజన చేసుకోవాలని హితవు పలికారు. బిల్లుల పేరుతో ఆసుపత్రిలో దోచుకుంటూ రైలులో భజన చేసుకుంటు వచ్చిందని.. ఆమె ఆసుపత్రిలో హిందువులకు రూపాయి తగ్గించావా అంటూ మండిపడ్డారు. ఆమె ఆసుపత్రి భాగోతాలు తెలియనివా..? కరోనా సమయంలో ఎన్ని కోట్లు దోచారోనని.. ఇంకా ఒవైసీ ఆసుపత్రి ఆసుపత్రి గురించి మాట్లాడుతారని మండిపడ్డారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ సైతం తిరుమలకు వెళ్లారని.. ఆయన డిక్లరేషన్ ఇచ్చారా? అని నిలదీశారు. హైదరాబాద్ నుంచి వచ్చి మాట్లాడుతున్న ఎంపీల నోరు ఆ రోజు ఏమైందని.. వెంట అన్యమతస్థుడిని డిక్లరేషన్ లేకుండా ఎందుకు తీసుకువెళ్లారని మోదీని ప్రశ్నించారంటూ నాని మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.