హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలోని వివిధ విభాగాల్లో 704 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, సిస్టమ్ అనలిస్టులు, అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులను జిల్లాల వారీగా నియమించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా పోస్టుల భర్తీకి 2019 డిసెంబర్లోనే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించగా, అనివార్య కారణాల వల్ల భర్తీని నిలిపివేశారు. తాజాగా వాటి భర్తీకి అనుమతి లభించింది. జిల్లా కేంద్రంగా నియామకాలు జరుపాలని ఉత్తర్వుల్లో ఆ శాఖ పేర్కొన్నది.
జిల్లా స్థాయిలో జరిగే ఎంపికకు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నేతృత్వం వహించనున్నది. ఈ మేరకు శుక్రవారం డీఈవో కార్యాలయాల్లో జనరల్ మెరిట్ లిస్టు విడుదల చేయనున్నారు. శనివారం క్యాటగిరీల వారీ గా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు సిద్ధం చేసి జూలై 3న విడుదల చేస్తారు. అభ్యంతరాలను 4లోగా స్వీకరించి, 5న వాటిని పరిశీలిస్తారు. 7న తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను 10న పరిశీలించి, అప్పటికప్పుడే నియామక పత్రాలను అందజేస్తారు. మూడురోజుల్లోగా ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 వరకు కాంట్రాక్ట్ కొనసాగుతుంది.