హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/వనపర్తి: జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది. ఒక్కో కాలేజీలో 150 సీట్లకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం అయినట్టేనని అధికారులు చెప్తున్నారు. రెండు జిల్లాల్లోనూ ఇప్పటికే మెడికల్ కాలేజీల భవనాలు పూర్తయ్యాయి. వనపర్తి మెడికల్ కాలేజీకి అనుమతులు రావడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
వనపర్తిలో నిబంధనల మేరకు కాలేజీకి అవసరమైన మౌలిక సౌకర్యాలు, లాబొరేటరీ, లైబ్రరీ, హాస్టల్స్, సౌకర్యాలు, ఫ్యాకల్టీ, అనుభవం, పబ్లికేషన్స్, నర్సింగ్ అండ్ పారా మెడికల్ సిబ్బంది వంటి సౌకర్యాలను ది మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బోర్డు నివేదిక ఆధారంగా ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. గత ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశాల ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మంజూరు చేయడంతోపాటు, రూ.510 కోట్ల నిధులు కేటాయించారు. కళాశాల కోసం 50 ఎకరాల స్థలాన్ని జిల్లా కేంద్రంలో కేటాయించారు. ముఖ్యమంత్రి కేటాయించిన నిధులతో మెడికల్ కళాశాల భవనం, పరిపాలనా భవనం, విద్యార్థి, సిబ్బంది, వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు.
ఖమ్మం, నిర్మల్ జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరుచేస్తూ ఉత్తర్వులు ఇవ్వటంపై ఆయా జిల్లాల మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పువ్వాడకు మెడికల్ కాలేజీ మంజూరుకు సంబంధించిన ఉత్తర్వు కాపీని సీఎం అందజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ కానుకగా ఇచ్చారని మంత్రి పువ్వాడ అన్నారు.