హైదరాబాద్ : ఆర్. ఓ.ఎఫ్.ఆర్ గురించి ముందడుగు పడింది. సీఎం కేసీఆర్ దీనికి శాశ్వత పరిష్కారం చూపడానికి కేబినెట్ సబ్ కమిటీ వేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం అమలు, పండగ తర్వాత ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభం, గిరిజన ప్రాంతాల్లోని చెరువుల్లో చేపలు పట్టడంపై గిరిజనులకు హక్కులు కల్పించడం, గిరి పోషణ అమలుపై దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు.
2005 లోపు పోడు చట్టం ప్రకారం అర్హులకు లబ్ధి చేకూర్చడంతో పాటు మిగిలిన వారికి మేలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే 3 లక్షల పట్టాలు ఇచ్చాం. అటవీ భూమి మీద వ్యక్తులకు ఎప్పటికీ హక్కులు రావు అన్నారు. కానీ ఆ భూమి మీద ఫలసాయం పొందే హక్కు వస్తుంది. బయ్యారంలో అటవీ భూమిలో అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. కానీ అది రెవెన్యూ భూమి కాదని వారి పట్టాలు చెల్లవని అటవీ అధికారులు చెప్పడం గతంలో చేసిన పొరపాట్లకు నిదర్శనం అన్నారు.
అంతే కాకుండా పట్టాలు ఇచ్చిన వారికి హద్దులు చెప్పకపోవడం, భూమి స్వాధీన పర్చడం కూడా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పెరిగాయి. ఇప్పుడు సీఎం కేసిఆర్ ఆలోచన ఈ పోడు వల్ల అటవీ అంతరించి పోవద్దు. అదే సమయంలో గిరిజనులకు న్యాయం జరగాలన్నది సీఎం కేసీఆర్ అభిమతం అన్నారు.
66 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని రికార్డ్స్ చెబుతున్నాయి. 3 లక్షల ఎకరాలకు ఇప్పటికే పట్టాలు ఇవ్వగా.. మరో 6 లక్షల ఎకరాల్లో పోడు జరుగుతుందన్నారు. ఇక మిగిలిన అటవీ భూమిని కాపాడాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై విధి విధానాలు రానున్నాయని మంత్రి తెలిపారు.
ఆధార్ లింక్ చేస్తే గిరిజనులందరికీ ఆధార్ ఉందా, లేదా దృష్టి సారించి, ఆధార్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే గురుకులాలను ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
గిరిపోషణ గిరిజన ప్రాంతాలకు అన్నిటికీ ఇద్దాం. ఈ పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు ఉన్న ఖాళీలు భర్తీ చేసి, అంగన్వాడీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. గిరి వికాసం కింద వ్యవసాయానికి కావాల్సిన ఉపకరణాలు అన్ని అందించి, ఉత్పత్తి పెరిగేలా చూడాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఆ ప్రాంత డిమాండ్ మేరకు ఏర్పాటు చేయాలన్నారు. మేడారం జాతర ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలన్నారు.
గిరిజనుల సమగ్రాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలన్నారు. సమీక్షా సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర రెడ్డి, సంయుక్త సంచాలకులు కళ్యాణ్ రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు భవేశ్ మిశ్రా, గౌతమ్ , ఇతర అధికారులు హాజరయ్యారు.