హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించి, అర్హులైన రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్నామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్ మాసబ్ట్యాంక్ సంక్షేమభవన్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 183 గిరిజన గురుకులాలు ఉన్నాయని, మరో 3 గురుకులాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బాలల సంక్షేమం, రక్షణకు తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ప్రశంసించారని గుర్తుచేశారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. తెలంగాణ అమలు చేసున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించిందని తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రశంస
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రంలో ఐదు రోజుల రోజులు పర్యటించారని, తెలంగాణలో జరుగుతున్న గిరివికాసాన్ని కీర్తించారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రశంసలు తమ బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేలా గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, స్పెషల్ సెక్రటరీ శ్రీధర్, అదనపు సంచాలకుడు సర్వేశ్వర్రెడ్డి, సీఈ శంకర్, జేడీ కల్యాణ్రెడ్డి, జీసీసీ జీఎం సీతారాంనాయక్ , ట్రైకార్ జీఎం శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.