హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యార్థులందరికీ పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్)ను అమలు చేయనున్నారు. టీఎస్పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్), ఆధార్ తరహాలో ఈ నంబర్ను కేటాయిస్తారు. అయితే, ఈ ఏడాది పదోతరగతి విద్యార్థుల మెమోలు, హాల్టికెట్లు, టీసీలపై ఈ పెన్ నంబర్ను ముద్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం మెమో జారీ చేశారు. సమగ్రశిక్ష అధికారుల ప్రతిపాదనలకు అంగీకరించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటి వరకు పదోతరగతి మెమోలపై కేవలం హాల్టికెట్ నంబర్ను పలు సెక్యూరిటీ ఫీచర్లతోముద్రిస్తున్నారు. దీంతో సర్టిఫికెట్లు అసలో.. నకిలీవో గుర్తించడానికి అధికారుల పరిశీలన తర్వాత తెలిసేది. కానిప్పుడు పెన్ నంబర్ ఆధారంగా సులభంగా దొరకపట్టవచ్చు.