హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప పోరులో టీఆర్ఎస్ గెలుపు లాంఛనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో 2-3 స్థానాల కోసం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ పోటీ పడుతున్నాయి. పరువు దక్కించుకునేందుకు పాకులాడుతున్నాయి. అయితే ఈ ఉప పోరులో తమదే గెలుపంటూ విర్రవీగుతున్న బీజేపీకి తీవ్ర భంగపాటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపు సంగతి దేవుడెరుగు.. ఆ పార్టీకి మూడో స్థానమే దిక్కనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలోనూ ఇందుకు తగ్గ పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ‘కాంట్రాక్ట్’ మోజులో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితులు అవగతమవుతున్నాయి. ఆయనలో కోపం, అసహనం పెరిగిపోతుండటమే అందుకు నిదర్శనమని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి. రాజగోపాల్రెడ్డి తీరు, బీజేపీ పరిస్థితి చూసిన వాళ్లంతా మునుగోడులో బీజేపీ ‘మాడు’ పగలటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్లో ఉన్న పరిస్థితితో పోల్చితే మునుగోడు పూర్తిగా భిన్నంగా ఉన్నదని పరిశీలకులు చెప్తున్నారు. అక్కడ అభ్యర్థుల పట్ల కొంత సానుభూతి పనిచేసిందని, మునుగోడులో మాత్రం కాంట్రాక్ట్ కోసం పార్టీ మారి తమను మోసం చేశాడనే వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు.
వాస్తవాన్ని గుర్తించిన యువత
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల నామినేషన్ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. తర్వాత నిర్వహించిన రోడ్ షోలలో యువత అధికంగా కనిపిస్తున్నారు. కాంట్రాక్ట్ల కోసమే రాజగోపాల్రెడ్డి పార్టీ ఉప ఎన్నిక తీసుకొచ్చారని, అభివృద్ధి పట్టించుకోలేదంటూ కేటీఆర్ వివరించిన తీరు యువతను ఆలోచింపజేస్తున్నది. రాజగోపాల్రెడ్డి వల్లే మునుగోడు అభివృద్ధి ఆగిపోయిందని, ఇప్పటికైనా టీఆర్ఎస్ను గెలిపిస్తే.. ఏడాదిలో అభివృద్ధి చేసుకోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మొదటి నుంచి యువతతోపాటు సంఘ్ను నమ్ముకొన్న బీజేపీకి ఈ వర్గాలు దూరమవుతున్నాయి. వామపక్ష చైతన్యం బీజేపీకి పంటి కింద రాయిలా మారింది. సొంతలాభం కోసం పార్టీ మారి ఉప ఎన్నిక తీసుకొనిరావటంతోపాటు, అభివృద్ధి చేయకపోవటంపై అన్ని గ్రామాల్లో రాజగోపాల్రెడ్డిని అడ్డుకుంటున్నారు. తమను గెలిపిస్తే ఏ పనులు చేస్తామన్నది టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇన్నేండ్లు ఎమ్మెల్యేగా ఉండీ ఏమీ చేయని రాజగోపాల్, మరోసారి తనకు ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్నారే తప్ప.. ఏం చేస్తారో చెప్పటం లేదు. ఆయనకు ఓటేస్తే వృథా కావటం తప్ప, అభివృద్ధి జరగదని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
పరువు కోసం కాంగ్రెస్ తపన
మునుగోడు ఉప ఎన్నికలో ఎంతో కొంత సత్తా చాటి, రాష్ట్ర రాజకీయాల్లో పరువు నిలుపుకోవాలనేది కాంగ్రెస్ అధిష్ఠానం యోచనగా చెప్తున్నారు. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీ పెద్దల ‘రాజీ’కీయంతో ఎదురైన ఘోర ఓటమితో ఆ పార్టీ పరువు గంగలో కలిసిపోయింది. ఈ నేపథ్యంలో కనీసం ఇక్కడైనా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ఈ ఉప ఎన్నికలో ఎలాగూ గెలుపు టీఆర్ఎస్దే అనే నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ నేతలు.. కనీసం రెండో స్థానంలో అయినా నిలిచే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తున్నది. క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా వారికి కొంత అనుకూలంగా ఉన్నాయి. అక్కడ ఆ పార్టీకి కొంత క్యాడర్తోపాటు ఓటు బ్యాంకు ఉండటం కలిసొస్తున్నది. దీంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై ప్రజల్లో కొంత సానుభూతి ఉండటం ఆ పార్టీకి రెండో స్థానంపై కాస్త ఆశలు రేకెత్తిస్తున్నది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి గతంలో కాంగ్రెస్ టికెట్పై గెలిచి, తన స్వార్థం కోసం అండగా నిలిచిన పార్టీని, గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి కాంట్రాక్టు కోసమే బీజేపీలో చేరారనే అభిప్రాయాలు అక్కడి ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఓటర్లు రాజగోపాల్రెడ్డికి తిరిగి ఓటు వేసే పరిస్థితి లేదని అంటున్నారు. వీటన్నింటినీ గమనిస్తే మునుగోడు ఉప పోరులో టీఆర్ఎస్ గెలుపు జెండా ఎగరేయడం రెండులో కాంగ్రెస్, మూడులో బీజేపీ నిలవడం ఖాయంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మునుగోడులో బీజేపీకి మూడో స్థానమే!
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి మూడో స్థానం అచ్చొచ్చినట్టుగా ఉన్నదన్న సెటైర్లు పేలుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీకి మూడో స్థానమే దక్కింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గంగిడి మనోహర్రెడ్డి 12,725 ఓట్లు దక్కించుకోవడమే గగనమైంది. దక్కిందీ మూడో స్థానమే. 2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీది మూడో స్థానమే. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గంగిడి మనోహర్రెడ్డికి 27,434 ఓట్లు దక్కించుకొని మూడో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలోనూ బీజేపీ తనకు కలిసొచ్చిన మూడో స్థానానికే పరిమితమై గత సంప్రదాయాన్ని కొనసాగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఆ పార్టీకి మునుగోడులో మూడో స్థానమే కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ కాకపోతే బరిలో ఉన్నవే మూడు ప్రధాన పార్టీలు కాబట్టి.. ఆ పార్టీల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత ఉన్నది బీజేపీ కాబట్టి ఆ పార్టీకి మూడో స్థానం ఖాయమైందనే అభిప్రాయాలున్నాయి.