మళ్లీ నడుం బిగించిన ఉద్యమ నేత
నేటి నుంచి దేశవ్యాప్త వరుస పర్యటనలకు సీఎం
పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు హాజరు
రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాల ప్రముఖులతో సమావేశాలు
దేశం కోసం అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆపన్న హస్తం
రైతు ఉద్యమంలో చనిపోయిన కిసాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం
కాలాన్ని కలగని.. స్వప్నాన్ని దర్శించి.. నిజం చేసి నిరూపించినవాడు..
కన్నతల్లికి విముక్తి కల్పించి జన్మభూమి రుణం తీర్చుకొన్న భూమి పుత్రుడు..మహారథుడు..
ఉద్యమ ఉత్తుంగ తరంగం కేసీఆర్.. మరో ఉదాత్త కార్యక్రమానికి ఉద్యమించబోతున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తన జాతి జనుల కలను సాకారం చేసిన ఉద్యమ నాయకుడు.. ఇప్పుడు భారత జనుల ఆకాంక్షల సాధన కోసం కదలబోతున్నారు. జాతీయ కార్యాచరణకు నడుం బిగించబోతున్నారు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ నెలాఖరు వరకు వివిధ రాజకీయ, సామాజిక కార్యక్రమాలతో పాటు పలువురు రాజకీయ, ఆర్థిక , పాత్రికేయ ప్రముఖులతో దేశ భవిష్యత్తు దశ, దిశ పై సమాలోచనలు చేయనున్నారు.
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ‘దేశం కోసం, దేశ ప్రగతి కోసం ప్రజలకు ఒక కొత్త ఎజెండాను సెట్ చేయడానికి నేను ఒక సైనికుడిగా పనిచేస్తాను. జాతీయ రాజకీయాలు, వ్యవస్థ, దేశ సమగ్ర స్వరూపం.. ఈ దేశం ఎటు పోవాలి? ఉన్న వనరులేమిటి? వసతులేమిటి? తదితర అంశాలపై అందరితో చర్చించి ముందుకు వెళ్తాం. ప్రస్తుతం దేశంలో రొటీన్ రాజకీయాలకు భిన్నంగా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వ్యక్తులు ప్రధానులు కావటం.. ఒక పార్టీకి అధికారం పోయి.. మరో పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం కాదు. స్వాతంత్య్ర లక్ష్యాలు సఫలం కాలేదనే విషయాన్ని మన ముందున్న దేశం స్పష్టంగానే చెప్తున్నది. ఫ్రంట్లు, టెంట్ల బాధల నుంచి బయటపడి.. కొత్త పంథాలో పురోగమించాలి. ఇందుకోసం తీసుకురావాల్సిన నిర్మాణాత్మక మార్పులు, విధానాలపై కసరత్తు చేయాలి’.. ఇటీవల హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్పష్టంగా వ్యక్తంచేసిన అభిప్రాయమిది. అంతకుముందే.. దాదాపు ఏడాది కాలంగా ముఖ్యమంత్రి అనేక సభల్లో దేశాన్ని బాగు చేసుకోవడానికి మనం ముందుకెళ్లాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించి, వారి ఆమోదాన్ని కూడా తీసుకొన్నారు. ఆ తరువాత అనేక రంగాల నిపుణులు, పాత్రికేయులతో విస్తృతంగా చర్చించారు.
వీటన్నింటినీ సాకల్యంగా ఒక రూపానికి తీసుకొని వచ్చి జాతీయ కార్యాచరణకు కదులుతున్నారు. భారతదేశం ఇప్పుడు ఒక సామాజిక మతపరమైన సంక్షోభంలోకి జారిపోతున్నది. రోజురోజుకూ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా క్షీణిస్తున్నది. ఈ క్రమంలో ఒక ఆల్టర్నేటివ్ మాడల్, ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను సీఎం కేసీఆర్ దేశం ముందు ప్రతిపాదించబోతున్నారు. రాజకీయాలను మూస ధోరణిలో నడపటంతో దేశం ఉజ్వలమైన ప్రస్థానం చేయలేకపోయిందని, దేశం ఒక సామూహిక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. క్రమశిక్షణతో, నియంత్రిత విధానంతో పురోగమించాలని కేసీఆర్ పలుమార్లు పేర్కొన్నారు. కొందరు రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు చేస్తున్న మత కుట్రలకు బలికాకుండా.. నిర్మాణాత్మక దృక్పథంతో, అభ్యుదయ పథంలో దేశాన్ని ముందుకు తీసుకుపోయే, ప్రజలంతా స్నేహభావంతో, సోదర భావంతో కలిసి, ఒకరికొకరు భుజమానించి, ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడినప్పుడే దేశం అభివృద్ధి పథంలో పైకి ఎదుగుతుందన్న దార్శనికతతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.
సాధ్యం కావన్నవాటినీ సాధించిన నేత
ఉద్యమనేతగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కార్యాచరణను తలకెత్తుకొన్నప్పుడు అది సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అందుకు అవసరమైన సైద్ధాంతిక ప్రాతిపదికను నిర్మించుకొని.. రాజకీయ కార్యాచరణను రూపొందించుకొని.. వ్యూహాలు, ఎత్తుగడలను అమలుచేస్తూ రాష్ర్టాన్ని సాధించి చూపించారు. మామూలుగా కేసీఆర్ ఏ పని తలపెట్టినా అది క్లిష్టమైనదిగా కనిపిస్తుంది. కష్టమైనదిగా అనిపిస్తుంది. సంభవమా? అని అనుమానం రేకెత్తిస్తుంది. దెబ్బతింటమేమో అని సందిగ్ధంలో పడేస్తుంది. అంతిమంగా విజయం వరిస్తుంది. కేసీఆర్ ఒక పనిని తలపెడితే దాన్ని సాధించేదాకా విశ్రమించరని తెలంగాణ వాదులంతా అంటారు. ఒక పనిని చేపట్టడానికి ముందు అది పథకమైనా.. రాజకీయ కార్యాచరణమైనా.. కేసీఆర్ చాలా ఆలోచిస్తారు. మేధావులు, ఆయా రంగాల నిపుణులతో చర్చిస్తారు. ఏ అంశంపైనా తొందరపడి నిర్ణయం తీసుకోరు. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పోరని రాజకీయ నిపుణులు గట్టిగా చెప్తున్నారు. గత ఎనిమిదేండ్ల పాలనలో.. అంతకుముందు 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇప్పుడు దేశానికి ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ ఎజెండా ఇవ్వటంలో కూడా ఇదే క్రమంలో విజయం సాధిస్తారని వారంటున్నారు. ప్రజాస్వామిక రాజకీయ యుగంలో ఏదీ అజేయం కాదని, ఎన్నికల్లో గెలుపు అంతిమంగా ప్రజల మేలును కోరే వారినే వరిస్తుందని చరిత్ర నిరూపించిన సత్యం. తెలంగాణలో అత్యంత బలమైన పార్టీలుగా భావించిన టీడీపీ, కాంగ్రెస్తోపాటు, బీజేపీని కూడా దారిలోకి తెచ్చుకొని.. కేసీఆర్ తెలంగాణను సాధించిన తీరే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని వారు చెప్తున్నారు. జాతీయ రాజకీయాలను మేలు మలుపు తిప్పడం సాధ్యమేనన్న విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.
అమర జవాన్లకు..అమర కిసాన్లకు అండగా..
పలు రాజకీయ, జాతీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పర్యటనలో రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సీఎం సమావేశం కానున్నారు. దేశం కోసం వీరమరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. హకుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి రైతు ఉద్యమంలో అసువులు బాసిన కర్షక కుటుంబాలను పరామర్శిస్తారు.
సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు..