కొడంగల్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలవుతుండడంతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి( Kodangal Mla Narendar reddy) అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బొంరాస్పేట మండలంలోని హకీంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు(Congress members) ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ(Brs Party)లో చేరారు.
ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల(Government Programmes)కు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు.
గతంలో రేవంత్రెడ్డి(Revanth reddy)ని నమ్మి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొడంగల్ ప్రజలు గెలిపించుకుంటే ప్రజలకు ఏమి చేయలేక పోయారని విమర్శించారు. ప్రజలు ఎమ్మెల్యేను కలవాలంటే వేలకు వేలు ఖర్చుపెట్టుకొని ఇంటి ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేదని ఆరోపించారు. డాబు చూపెట్టుకునే నాయకుడు కాదని ప్రజల మధ్యన ఉండే నాయకుడు కావాలని కొడంగల్ ప్రజలు గత ఎన్నికల్లో రేవంత్రెడ్డిని తరిమికొట్టారని అన్నారు.
రేవంత్రెడ్డి అవలంభిస్తున్న వైఖరికి విసిగి చెంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికే ప్రధానంగా కృషి చేస్తుండడం వల్ల తెలంగాణ దేశానికి తలమానికంగా మారిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.