హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్రెడ్డి (Jagadish reddy) , పల్లా రాజేశ్వర్రెడ్డి (Palla Rajeshwar reddy) , ఎంపీ లింగయ్య యాదవ్(MP Lingaiah Yadav) అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనే ధీమా కార్యకర్తలో ఉందని వెల్లడించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది . అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలల్లో అందించిన కేసీఆర్(KCR) సీఎం గా లేక పోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు ఆలోచనలో పడ్డారని వెల్లడించారు. సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వారు ఆరోపించారు.
సంక్షేమ పథకాలకు ఇన్ని అడ్డంకులా..
ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు పథకాలపై స్పష్టత లేదని తెలిపారు. పథకాల అమలు కోసం కేసీఆర్ హాయంలో ఇన్ని అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొంత మంది కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో(Parliament Elections) మంచి ఫలితాలు తీసుకురావడానికి గట్టిగా కష్టపడతామని వివరించారు.
బీఆర్ఎస్ కార్యకర్తల పై కాంగ్రెస్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలుగా పార్లమెంటులో విభజన సమస్యలపై పోరాటం చేశామని ఎంపీ లింగయ్య యాదవ్ గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడలేదని ఆరోపించారు.