Pawan Kalyan | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్యాకేజీ స్టార్.. పవన్ కల్యాణ్ కారు కూతలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. నాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి నేడు అమరుల బలిదానాల గురించి మాట్లాడటం సిగ్గనిపించడం లేదా అని నిలదీసింది. తెలంగాణ ప్రకటన చేస్తే భోజనం మానేశానని రాష్ట్ర ఏర్పాటుపై అక్కసు వెళ్లగక్కిన పవన్.. నేడు తెలంగాణపై ప్రేమ ఒలకబోస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్న బీజేపీ, జనసేన అభ్యర్థులు బుధవారం వరంగల్లో ఏర్పాటుచేసిన ప్రచార సభలో పవన్ కల్యాణ్ అడ్డగోలుగా మాట్లాడటంపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తంచేసింది. తెలంగాణలో బలిదానాలు ఇప్పుడే గుర్తొచ్చాయా? నాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పిల్లలు పిట్టల్లా రాలుతుంటే ఎక్కడికి పోయావ్? నాడు సమైక్య పాలకుల పంచన చేరి తెలంగాణను వ్యతిరేకించలేదా? మీకు ఇప్పుడు మాత్రం తెలంగాణ కావాల్సి వచ్చిందా? అంటూ తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. తెలంగాణలో పాలన అద్భుతమంటూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నదని.. గతంలో కీర్తించిన అదే నోటితో అవినీతి, కమీషన్ల రాజ్యం అనడంపై అది నోరా, తాటిమట్టా? అని ఫైరవుతున్నారు. ప్రధాని మోదీతో జతకట్టగానే అభివృద్ధి తెలంగాణ.. కమీషన్ల తెలంగాణగా మారిపోయిందా? అని నిలదీస్తున్నారు.
ఏపీలో నీ సంగతి చూసుకో…
బీజేపీ బాటలో నడుస్తున్న పవన్.. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చూడాలని ఉందనడంపై నెట్టింట్లో జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. బీసీగా ఉన్న నువ్వు ముందు ఏపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకో.. ఆ తర్వాత తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడు? అంటూ చురకలంటిస్తున్నారు. ఏపీలో ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ తనకు తాను ముఖ్యమంత్రి అవుతానని ధైర్యంగా చెప్పుకోలేని పవన్.. తెలంగాణలో ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం హాస్యాస్పందంగా ఉన్నదని ఎద్దేవా చేస్తున్నారు. పచ్చని తెలంగాణలో మళ్లీ చిచ్చు పెట్టేందుకు సమైక్యవాదుల తరఫున కుట్రలు చేస్తున్నావా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నారు.