జగిత్యాల : రైతుల ముసుగులో రాజకీయాలు చేసే నాయకుల పట్ల అప్రమత్తం గా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్( Mla Sanjay Kumar) రైతులకు పిలుపునిచ్చారు. ఆదివారం జగిత్యాల నియోజకవర్గంలోని చల్గల్ వ్యవసాయ మార్కెట్లో పాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు.
రైతాంగ శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుండగా ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాల హయాంలో ధాన్యం కొనుగు కేంద్రాలు ఎన్ని, సేకరించిన ధాన్యం ఎంత? ప్రస్తుతం ఉన్న కేంద్రాలు, సేకరించిన ధాన్యం వాటిపై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను(Farmers) ఇబ్బంది పెడితే పత్రిపక్షాలు మిల్లుల ఎదుట ధర్నా చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద కాదని సూచించారు.
గత నెల రోజుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో కొంత ఇబ్బంది ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి 24 గంటల కరెంట్, మిషన్ కాకతీయ(Mission Kakatiya), కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్ట్,చెక్ డ్యాం లు,రైతు బంధు కార్యక్రమల తో పంట సాగు పెరిగిందని వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాల ముకుందం, ఏఎంసీ డైరెక్టర్ ఆనంద్ రావు, ఎంపీటీసీ దమ్మా మల్లారెడ్డి,ఉప సర్పంచ్ పద్మ తిరుపతి,పట్టణ పార్టీ ప్రధానకార్యదర్షి అల్లాల ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.