హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): కేంద్రం జూన్ 25నుంచి చేపట్టనున్న సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సీరియస్గా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు.. దొంగ ఓట్లు ఉండవద్దని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అసలు కే మోసం వస్తుందని చెప్పారు. శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సనత్నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరై ‘సర్’ ప్రక్రియపై వారికి దిశానిర్దేశంచేశారు.
పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా సాధారణంగా జరిగే ఈ వడపోత కార్యక్రమాన్ని బీజేపీ బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వివాదాస్పదం చేసిందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సర్ను అడ్డగోలుగా వినియోగించడం, తమ వ్యతిరేక వర్గీయుల ఓట్లను గంపగుత్తగా తొలగించినట్టు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
గతంలో ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈసీ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ నుంచి తనతో పాటు నలుగురు ఎంపీలు, ఒక మాజీ ఎంపీ హాజరై అభ్యంతరాలను వారి ముందుంచామని తెలిపారు. అన్ని పార్టీల నుంచి బూత్లెవల్ ఏజెంట్లను నియమించాలని కోరగా సానుకూలంగా స్పందించిందని కేటీఆర్ చెప్పారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు చేపట్టనున్న సర్ ప్రక్రియ నేపథ్యంలో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లు ఇప్పటినుంచే తగిన కార్యాచరణ రూపొందించుకొని ముందుకుసాగాలని కేటీఆర్ కోరారు. ఒక్కో బూత్లో సుమారు వెయ్యి నుంచి 1,200 ఓట్లు ఉంటాయని, బీఎల్ఏలు ప్రతిరోజూ పది నుంచి పదిహేను ఇండ్లను సందర్శించి ఓటర్ల వివరాలను సేకరించాలని చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు ప్రక్రియలను పూర్తిచేయాలని సూచించారు.
‘మరణించిన వారి ఓట్లు తొలగించాలి.. కొత్తగా అర్హత ఉన్న వారిని చేర్పించాలి.. గతంలో ఇక్కడ ఉండి మరోచోటుకు వెళ్లిన వారిని గుర్తించి వారి ఛాయిస్ మేరకు తొలగించడం, చేర్చడం పూర్తిచేయాలి.. గ్రామాల నుంచి వలసవచ్చిన వారిని గుర్తించి వారి సూచన మేరకు ఓట్లు చేర్చడం, తొలగించడం చేయాలి’ అని దిశానిర్దేశం చేశారు. ఏమాత్రం పొరపాటు చేసినా భవిష్యత్లో నష్టపోయేది మనమే అన్నది గుర్తుంచుకోవాలని నొక్కిచెప్పారు.
ఈ సందర్భంగా తలసానిపై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎలాంటి కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తిచేయడంలో దిట్ట అని, ఆయన్ను చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఛీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యే రమేశ్, నాయకులు తలసాని సాయికిరణ్, మాజీ కార్పొరేటర్లు స్వరూప, వెంకటేశ్గౌడ్, శ్రీనివాస్గౌడ్, హన్మంతరావు, బాల్రెడ్డి, జైరాజు, సత్యనారాయణ, అరుణ, శేషకుమారి తదితరులు పాల్గొన్నారు.
కష్టపడ్డ వారికే భవిష్యత్లో జరిగే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పైరవీలకు తలొగ్గబోమని సర్వే చేయించి ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే అవకాశం ఇస్తామని చెప్పారు. సమీప భవిష్యత్లో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో జరిగే ఎన్నికల్లో పార్టీ అభివృద్ధికి శ్రమించిన వారికే ప్రాధాన్యమిస్తామని స్పష్టంచేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీలతో కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టంచేశారు.
‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్కరి నోట విన్నా ఇదే మాట వినపడుతున్నది’ అంటూ కేటీఆర్ ఉద్ఘాటించారు. రెండున్నరేండ్లలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమాగా చెప్పారు. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్రెడ్డి అమలులో దారుణంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇక భారత జనతా పార్టీకి తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలం లేదని, ఆ పార్టీ పరిస్థితి సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ అని ఎద్దేవా చేశారు.
సర్లో భాగంగా ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే ఎన్యూమరేటర్లకు సహకరించాలని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ అనుకూలుర ఓట్లను బీజేపీ, కాంగ్రెస్ తొలగించే ప్రమాదమున్నదని.. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎదురైన సమస్యలను ఆయన ప్రస్తావించారు.
ఈ పరిస్థితుల్లో పార్టీ బూత్లెవల్ ఏజెంట్లు ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు. ఓట్ల తొలగింపులో ఆ పార్టీల ఆటలు సాగనీయవద్దని సూచించారు. దేశంలో ఏ పార్టీకీ లేనివిధంగా బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉన్నదని, అందుకే 36వేలకు పైగా బూత్లకు 71వేల మంది ఏజెంట్లను నియమించిన ఘనత గులాబీ పార్టీకే దక్కిందని పేర్కొన్నారు. అయితే పార్టీ ఏజెంట్లు ఈ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, అవసరమైతే మరోసారి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.